నడివీధిలో ఓ మహిళతో సహ ఇద్దర్ని ఓ వ్యక్తి విచక్షణారహితంగా కొడుతుంటే.. చుట్టూ ఉన్న జనం చోద్యం చూస్తున్నారు. అత్యంత అమానుష ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్లో చోటుచేసుకుంది. ఉత్తర రినాజ్పూర్ జిల్లా చోప్రాకిలో జరిగినట్టు ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం పేర్కొన్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటన వారాంతంలో జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళను కర్రతో చితకబాదుతుంటే.. కొందరు చుట్టూచేరి సినిమా చూసినట్టు నిలబడ్డారు.
దెబ్బలకు తాళలేక బాధితురాలు ఆర్తనాదాలు చేస్తున్నా ఎవరూ స్పందించలేదు. చావబాదిన నిందితుడు.. ఆమెతో పాటు మరో వ్యక్తిపై దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. గుంపుగా ఉన్న జనం అతడ్ని ఆపకపోగా... సాయం చేయడం గమనార్హం. మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి.. కడుపులో కాలితో తన్నాడు. దాడికి పాల్పడిన నిందితుడి పేరు తజేముల్ అని.. అతడికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని సీపీఎం, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా వివాదాలపై సత్వర న్యాయం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఆరోపణలు చేస్తున్నారు.
అయితే, మహిళతో సహ మరో వ్యక్తిని ఎందుకు చావబాదాడనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, వీడియోపై అధికార టీఎంసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. బెంగాల్లో మమతా బెనర్జీ దుర్మార్గపు పాలన నడుస్తోందని బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
‘వీడియోలోని మహిళను చావగొడుతున్న దుర్మార్గుడు తేజేముల్.. అతడు ఇన్సాఫ్ సభ పేరుతో స్థానిక వివాదాలపై పంచాయతీ పెడుతుంటాడు.. చోప్రా ఎమ్మెల్యే హమీదుర్ రహ్మాన్కు ముఖ్య అనుచరుడు’ అని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. దీన్ని సందేశ్ఖలీ ఘటనతో పోల్చారు. అయితే, ఈ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa