సమాజంలో రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. అది ఎంత తీవ్రంగా మారిందంటే.. భార్యను కాపురానికి పంపలేదనే కోపంతో ఓ వ్యక్తి తన అత్తింటిపై దాడి చేశాడు. ఏకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. రాత్రివేళ పెట్రోల్ తీసుకుని వచ్చిన నిందితుడు.. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అయితే అదృష్టం బాగుండి.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఇంటి ముందు భాగం కాలిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని ఈడేపల్లికి చెందిన గండికోట శ్యాంప్రసాద్ రెడ్డి తమ కుమార్తెను పెడనకు చెందిన దాసరి శబరీనాథ్కు ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే అంతలోనే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. శబరీనాథ్ చెడు వ్యసనాలకు బానిస కావటంతో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారటంతో.. శ్యాంప్రసాద్ రెడ్డి కూతురు అత్తగారిల్లు వదిలేసి వచ్చింది. గత కొంతకాలంగా పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే భార్యను కాపురానికి పంపాలంటూ మామ శ్యాంప్రసాద్ రెడ్డిని.. అల్లుడు శబరీనాథ్ గత కొంతకాలంగా కోరుతున్నారు. అయితే శ్యాంప్రసాద్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. దీంతో ఆదివారం రాత్రి శబరినాథ్.. ఈడేపల్లిలోని శ్యాంప్రసాద్ రెడ్డి ఇంటివద్దకు చేరుకున్నాడు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మూడు బైక్లు పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఇంటి ముందు భాగం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ఆ తర్వాత పక్కనే ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి బంధువుల ఇంటి వద్దకు వెళ్లిన శబరీనాథ్ అక్కడ నిలిపి ఉన్న మరో రెండు వాహనాలను తగలబెట్టాడు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన అల్లుడిపై మామ శ్యాంప్రసాద్ రెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక తన కుమార్తె పుట్టింటికి వచ్చిందని.. అయితే కాపురానికి పంపలేదనే కోపంతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు ఫిర్యాదు చేశారు. శ్యాంప్రసాద్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa