కడప రెడ్డమ్మగా బాగా పాపులర్ అయిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ విషయంలో కార్పొరేటర్ అయిన తనకు ఎలాంటి సమాచారం లేదని.. తన డివిజన్లో తాను కాకుండా బయట వ్యక్తులు పింఛన్ ఎలా పంపిణీ చేస్తారని కార్పొరేటర్ ఉమాదేవి.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమానికి కార్పొరేటర్ రారా.. ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపాలా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడపలో గురువారం డిప్యూటీ మేయర్ ముంతాజ్బేగం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తొలిసారిగా టీడీపీ కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి హాజరయ్యారు. వీరికి కార్పొరేటర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మాట్లాడుతూ.. ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీకి తనకు ఆహ్వానం అందలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డిని గట్టిగా ప్రశ్నించారు.
దీనిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైరయ్యారు. 50 డివిజన్లు ఉన్న కడప కార్పొరేషన్లో అందరూ వచ్చారని.. మీరొక్కరే రాలేదని నిలదీశారు. ఏ ఒక్క కార్పొరేటర్కు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపలేదని, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే స్వచ్ఛందంగా రావచ్చని అన్నారు. కిరీటాలు పెట్టి.. డప్పులు దర్పాలతో ఎవ్వరినీ తీసుకెళ్లే పరిస్థితి లేదని.. ఇదేమీ ఇంట్లో పెళ్లికాదంటూ కాస్త గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న కమిషనర్.. సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి మాట్లాడదామంటూ సాధారణ పరిస్థితి తీసుకువచ్చారు.
అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నగరానికి ప్రత్యేక స్థానం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, అధికారులు, ఇంజనీర్లు, కార్పొరేటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa