ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 22 నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటూ సభను నిర్వహించాలని భావిస్తున్నారు.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం సరిపోకపోవడంతో.. ఈ సమావేశాల్లో బడ్జెట్కు అవకాశం లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు గత ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ఈ నెల 31తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇది ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాతే బడ్జెట్పై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. మరో మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్థికంగా వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చిన తర్వాత సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్కు సంబంధించిన ప్రతిపాదనపై సీఎం ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను రెండు రోజుల పాటూ నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయగా.. రెండో రోజు అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించినా.. ఆర్థిక పరిస్థితిపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా శాఖలు, అంశాల వారీగా ప్రభుత్వం వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థికపరమైన అంశాలన్నీ ఒ కొలిక్కి వచ్చిన తర్వాత బడ్జెట్పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa