ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. మహిళలకు రూ.83 కోట్ల రుణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 09:22 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త కొత్త సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ సేవలను రాష్ట్రంలో విస్తరించేందుకు ముందుకువస్తుండడం ఏపీ వాసులకు శుభపరిణామంగా చెప్పవచ్చు. కొత్త సంస్థలు రావడంతో ఉపాధి అవకాశాల మెరుగుపడతాయి. అలాగే ఇతర ఆర్థిక సేవల సంస్థలు వస్తే ప్రజల అవసరాలు వేగంగా తీరేందుకు అవకాశం లభిస్తుంది. తాజాగా మరో సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అదే రూరల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ద్వార క్షేత్రీయ గ్రామీణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ద్వార కేజీఎఫ్ఎస్).


తాజాగా ఏపీ గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త అందించింది ద్వార కేజీఎఫ్ఎస్ ఆర్థిక సేవల సంస్థ. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. త్వరలోనే తమ సేవలను ఏపీలో ప్రారంభిస్తామని పేర్కొంది. ఏపీలో తమ సేవలు విస్తరించేందుకు గ్లోబల్ జెండర్- స్మార్ట్ ఫండ్ పోర్ట్ ఫోలియో మేనేజర్ ట్రిపుల్ జంప్ నుంచి 10 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ మొత్తం సుమారు రూ. 83 కోట్ల నిధుల్ని సమీకరించినట్లు ద్వార కేజీఎఫ్ఎస్ ఎండీ, సీఈఓ ఎల్‌వీఎల్ఎన్ మూర్తి తెలిపారు. ఈ 10 మిలియన్ డాలర్లలో 5 మిలియన్ డాలర్లు సబార్డినేటెడ్ రుణాన్ని, 5 మిలియన్ డాలర్లను సీనియర్ సెక్యూర్డ్ రుణాన్ని ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (లు కలిగి ఉంటుందని తెలిపారు. నిధుల సమీకరణ ద్వారా వచ్చే మొత్తాన్ని మహిళా లబ్ధిదారులకు మైక్రో ఎంటర్ ప్రైజ్ రుణాలు అందించడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.


'ట్రిపుల్ జంప్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో మా ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేస్తుంది. తక్కువ ఆదాయ వనరుల వర్గానికి ఆర్థిక పరిష్కారాలు అందిస్తున్నాం. ట్రిపుల్ జంప్ నుంచి సేకరించిన రూ. 83 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత మహిళలకు సూక్ష్మ రుణాలు అందిస్తాం. వీటి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మా వంతు కృషి చేస్తాం. ఆంధ్ర ప్రదేశ్‌లో అడుగు పెట్టడం ద్వారా దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో మా సేవలు ప్రారంభించినట్లవుతుంది. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు మా సేవలు విస్తరించేందుకు కృషి చేస్తాం' అని ద్వార కేజీఎఫ్ఎస్ ఎండీ, సీఈవో ఎల్వీఎల్ఎన్ మూర్తి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa