ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌కు టీడీపీ బంపరాఫర్.. అసెంబ్లీలో చంద్రబాబుకు రిఫర్ చేస్తామంటూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 08:09 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకుండా కేవలం సీనరేజ్‌ ఛార్జి, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుంటారు. జిల్లాల్లో కలెక్టర్‌ నేతృత్వంలో ఉండే ఇసుక కమిటీలకు అధికారం ఇచ్చారు.కేవలం డిజిటల్‌ చెల్లింపులను మాత్రమే తీసుకుంటారు. ఇసుకను తవ్వి, రీచ్‌ నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేస్తారు. అందుకు అయ్యే నిర్వహణ ఖర్చు, స్టేషనరీ వ్యయం, సీనరేజ్‌ ఫీజు, జీఎస్టీ మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. నిర్వహణ ఖర్చులు, ఫీజులు కలిపి టన్ను ఇసుక ధర ఎంతనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేస్తుందని అధికారులు తెలిపారు. అయితే అధికార పార్టీ టీడీపీ, విపక్షం వైఎస్సార్‌సీపీ మధ్య ఇసుక వ్యవహారంపై వార్ నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఇసుక ఉచిమని చెబుతూనే.. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఉచిత ఇసుక నాటకమని.. అదంతా పేరుకు మాత్రమేనని.. డ‌బ్బులు స‌మ‌ర్పించుకోవాల్సిందేనని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. కూట‌మి స‌ర్కారు తాత్కాలిక కొత్త విధానంలో ప్ర‌త్యేక‌త ఇదీ అంటూ ఎద్దేవా చేసింది. ప‌న్నుల మోత‌, ర‌వాణా చార్జీలు, నిర్వ‌హ‌ణ ఫీజులు త‌డిసిమోపెడు అవుతోందని.. ఇసుక క‌మిటీల‌పై పెత్త‌న‌మంతా టీడీపీ నేతలదేనని.. ర‌వాణా ముసుగులో బ‌య‌ట‌కు త‌ర‌లించి సొమ్ము చేసుకునే య‌త్నాలు చేస్తున్నారని ఆరోపించారు.


దాదాపు 40 ల‌క్ష‌ల ట‌న్నులు గ‌త 40 రోజుల్లో మాయం అయ్యిందని.. స్టాక్ పాయింట్లు దగ్గర స‌గం నిల్వ‌ల‌ను టీడీపీ నేత‌లు కొల్ల‌గొట్టారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది. ‌గత ప్ర‌భుత్వం వ‌ర్షాకాలం అవ‌స‌రాల‌కు ముందుగా నిల్వ చేసిందని.. జ‌గ‌న్ హ‌యాంలో ఏటా ఖ‌జానాకు రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.ఇప్పుడు ఉచిత‌మంటూ జ‌నం నుంచే ముక్కుపిండి వ‌సూలు చేస్తున్నారని.. ఉసూరుమంటూ వినియోగ‌దారులు ఖాళీగా తిరిగి వెళ్తున్నారని ఆరోపించారు. వ‌ర్షాకాలం ముగిసిన త‌ర్వాతే తాపీగా కొత్త విధానం అమలు చేస్తున్నారన్నట్లుగా ప్రస్తావించారు.


వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 'అవును ఇసుక ఫ్రీనే.. ఇసుకకి రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే, నిన్ను అసెంబ్లీలో మొదటి బెంచీలో కూర్చోపెట్టమని, బాబు గారికి రిఫర్ చేస్తాం.. నువ్వు ఎంత విష ప్రచారం చేసినా, ఉచిత ఇసుక తీసుకునే ప్రజలకు తెలుసు, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు తెలుసు.. నువ్వు ఎంత తప్పుడు ప్రచారం చేస్తే, అంత వెధవ్వి అవుతావు.. ఇసుక ఫ్రీ.. అనేది 2019 ముందే ఉన్న విధానం.. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. లోడింగ్, రవాణా చార్జీలు భరించాలి.. అవి కూడా ఫ్రీ ఇవ్వాలంటే, ఎలాగూ తాడేపల్లి కొంపలో ఖాళీనేగా, వచ్చి లోడింగ్ చేస్తే ప్రజలకు లోడింగ్, రవాణా చార్జీలు కూడా ఉండవు.. ప్రజలకు కూడా సేవ చేసినట్టు ఉంటుంది. ఒకసారి మీ ముఠా ఆలోచించండి' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.


మరోవైపు ఇసుకను ఉదయం నుంచి సాయంత్రం వరకు లోడింగ్‌ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక ఉంది, ధర ఎంత అనే వివరాలు గనులశాఖ వెబ్‌సైట్‌ www.mines.ap.gov.in లో అందుబాటులో ఉంటుందన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిల్వకేంద్రాలు పనిచేస్తాయని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ ఇసుక విక్రయాలు, ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయి ఎప్పటికప్పుడు గనులశాఖ పోర్టల్‌లో అప్డేట్ చేయనున్నారు.


ఇసుక కావాల్సిన వినియోగదారులు ఆధార్, మొబైల్ నంబర్, అడ్రస్, ఇసుక రవాణా చేసే వాహణం నంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. అంతేకాదు ఇసుకను నిర్మాణ అవసరాలకు మించి నిల్వ చేసినా, రీసేల్ చేసినా, ఇతర అవసరాలకు వినియోగించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. రాష్ట్రంలో ఎవరైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే రూ.2 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa