ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లనున్నారు. జులై 11వ తేదీన విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటించనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖ పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. 11వ తేదీ ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఏపీ మెడ్ టెక్ జోన్ను సైతం సందర్శిస్తారని సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు విశాఖ వెళ్లనున్న నేపథ్యంలో ఇప్పుడో అంశం ఆసక్తికరంగా మారింది. అదే రుషికొండ ప్యాలెస్ వ్యవహారం.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ భవనాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒకట్రెండు రోజులకే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. రుషికొండ భవనాలను సందర్శించారు. విలేకర్లను వెంటబెట్టుకుని వెళ్లి.. రుషికొండ భవనాలను పరిశీలించారు గంటా శ్రీనివాసరావు. రుషికొండ భవనాలను రూ.500 కోట్లు ఖర్చు చేసి మరీ గత వైసీపీ ప్రభుత్వం రహస్యంగా కట్టిందంటూ గంటా శ్రీనివాసరావు అప్పట్లో ఆరోపించారు. రుషికొండ కట్టడాలపై ఏం జరుగుతుందనేదీ తెలుసుకోవడానికి గతంలో తాము వస్తే అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. వైఎస్ జగన్ పచ్చటి కొండను.. గుండు చేసి రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారంటూ గంటా ఆరోపించారు.
ఇక రుషికొండ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ మీద, వైఎస్ జగన్ మీద అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇక ఈ భవనాలను ఏం చేయాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని అప్పట్లో గంటా శ్రీనివాసరావు చెప్పారు. త్వరలోనే విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారని.. అప్పుడు రుషికొండ భవనాలపై చర్చిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైన నేపథ్యంలో .. ఈ పర్యటనలో చంద్రబాబు రుషికొండ భవనాలను పరిశీలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే వందలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలను ఎలా ఉపయోగించాలనే దానిపై చంద్రబాబు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa