గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని విధ్వంసంతో భారీ నష్టం సంభవించటంతో పాటు నష్ట నివారణ కోసం ఏ పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రాజధాని వ్యాప్తంగా కమ్మేసిన పిచ్చిచెట్లు, భారీగా పెరిగిన ముళ్ల కంపలను తొలగించటానికి సీఆర్డీఏ రూ.36 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అమరావతి రాజధాని పనులకు సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. సీఎం పర్యటన సందర్భంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పిచ్చిచెట్లు, కంపలను కొంత మేర తొలగించినా.. రాజధాని వ్యాప్తంగా వీటిని తొలగించటం సీఆర్డీఏకు పెను సవాల్గా మారింది. దీంతో భారీఎత్తున యంత్ర సామగ్రిని ఉపయోగించి వీటిని తొలగించటానికి సీఆర్డీఏ టెండర్లు పిలవాల్సి వచ్చింది. అమరావతి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ చేయటం కోసం రూ.36.50 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ అధికారులు మంగళవారం టెండర్లు పిలిచారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి బిడ్ డాక్యుమెంట్ను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 15వ తేదీన కాంట్రాక్టర్లతో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తారు. 22వ తేదీన క్లారిఫికేషన్స్ కోసం కాంట్రాక్టర్లతో సమావేశమౌతారు. అదేరోజు నుంచి బిడ్లను సమర్పించుకునే అవకాశం కల్పిస్తారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో బిడ్ల సమర్పణకు గడువు ముగుస్తుంది. కాంట్రాక్టు సంస్థలు కన్సార్టియంగా కానీ జాయింట్ వెంచర్గా కానీ ఏర్పడి టెండర్లలో పాల్గొనేలా అవకాశం కల్పించారు. అంతిమంగా అర్హతల ప్రాతిపదికన, అతి తక్కువగా కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగిస్తారు. రాజధాని వ్యాప్తంగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడానికి నిర్దేశిత గడువు, స్కోప్ ఆఫ్ వర్క్స్ గురించి కాంట్రాక్టు సంస్థలతో నిర్వహించే ప్రీ బిడ్ సమావేశంలో తెలియజేస్తారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట, ఎల్పీఎస్ ఇన్ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు. దాదాపుగా రాజధాని ప్రాంతం అంతా పెరిగిపోయిన కంప వనాన్ని తొలగించటానికి ఎంత లేదన్నా నెల రోజులకుపైగా సమయం పడుతుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa