ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు శుభవార్త వినిపించారు. గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) జీవో, గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. జీపీఎస్ గెజిట్ జారీపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు జీపీఎస్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నుంచి ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2023 అక్టోబర్ 20 నుంచి జీపీఎస్ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో జీపీఎస్ అమలుపై గెజిట్ నోటిఫికేషన్ తాత్కాలికంగా ఆపివేయాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
అసలేం జరిగిందంటే?
ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో జీపీఎస్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే దీనికి సంబంధించి జీవో నంబర్ 54ను జూన్ 12వ తేదీ విడుదల చేశారు. సరిగ్గా అదే రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. అయితే జీవో విడుదలైన తర్వాత జులై 12వ తేదీన గెజిట్లో అప్ లోడ్ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షిస్తామని చెప్పిన టీడీపీ కూటమి.. ఇలా చేయడం ఏంటని మండిపడ్డాయి. అయితే ఈ గెజిట్తో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేశారని.. వైసీపీ ప్రభుత్వంలోనే దీనిని రూపొందించారని తెలిపారు.
ఈ క్రమంలోనే జీపీఎస్ జీవో, గెజిట్ రద్దు చేయాలని యూటీఎఫ్ సహా ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జీపీఎస్ జీవో, గెజిట్ తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే గెజిట్ ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారణ చేయాలని ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa