ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడ్కొ గృహాలను త్వరలోనే అందిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 08:50 PM

అతి త్వరలో టిడ్కో గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికల హమీలో భాగంగా కొవ్వూరులోని టిడ్కొ గృహాలను నాయకులు, అధికారులతో కలసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19లో పట్టణ ప్రాంతాల్లోని పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు టిడ్కొ గృహాల నిర్మాణం చేపట్టారు. పట్టణంలో 240 సింగిల్‌ బెడ్‌ రూమ్‌లు, 240 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి వారి నుంచి షేరు ధనం కట్టించి గృహాల నిర్మాణం చేపట్టి 80 శాతం నిర్మాణ పనులు పూర్తిచేశారన్నారు. జగన్‌ ఐదేళ్లలో పాలనలో మిగిలిన 20శాతం పనులు పూర్తిచేసి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. లబ్ధిదారులు అప్పులు చేసి తమ వాటా సొమ్ము చెల్లించారని, వాటికి వడ్డీలు కట్టలేక, ఇళ్లకు అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలనలో టిడ్కో గృహాల పనులను పునః ప్రారంభించామని, ప్రస్తుతం తాగునీటి పైపులైను పనులు, జంగిల్‌ క్లియరెన్సు పనులు జరుగుతున్నాయన్నాయన్నారు. ఇటీ వల కురిసిన వర్షాలకు సత్యవతినగర్‌ మినీ బైపాస్‌రోడ్‌ నుంచి టిడ్కో గృహాల వరకు రోడ్డు బురదగా ఉండడంతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించామన్నారు. మరో రెండు రోజుల్లో టిడ్కో గృహాల కాంట్రాక్టర్లతో గృహనిర్మాణశాఖ మంత్రి సమీక్షా సమావేశం ఉందన్నారు. సాధ్యమైనంత తొందరలో లబ్ధిదారులకు గృహాలను అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు కంఠమణి రామకృష్ణారావు, సూరపనేని చిన్ని, టీడీపీ పట్టణాధ్యక్షుడు దాయన రామకృష్ణ, కేవీకే రంగారావు, తోరం నగేష్‌, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa