భారత్ మహిళా క్రికెట్ జట్టు ఘనవిజయం సాధించింది. మహిళల ఆసియా కప్ 2024 టోర్నమెంట్లో భారత్ మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఓడించి బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. అందులో భారత్, నేపాల్, యూఏఈ, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇందులో భాగంగా తన తొలి మ్యాచులో భారత్.. శుక్రవారం పాకిస్థాన్తో తలపడింది.
డంబుల్లా వేదికగా జరిగిన టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తమ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి పాక్కు ఎంత సమయం పట్టలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ గుల్ ఫిరోజా (5) ఔట్ అయింది. ఆ తర్వాత మునీబా (11) సైతం స్వల్ప స్కోరుకే ఔట్ అయింది. దీంతో ఆ జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారింది. అమీన్ (35 బంతుల్లో 25 రన్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ పరుగులు చేయడంపై మాత్రం విఫలమైంది. చివరకు పాకిస్థాన్ మహిళల జట్టు 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌల్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయంగా పాటిల్లో రెండేసి వికెట్లు చొప్పున తీశారు.
ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు షెఫాలీ వర్మ (29 బంతుల్లో 40 రన్స్). స్మృతి మంధాన (31 బంతుల్లో 45 రన్స్) సత్తా చాటారు. దీంతో భారత్ 9.2 ఓవర్లలో 85/0తో నిలిచింది. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ ఔట్ అయినా.. మిగిలిన బ్యాటర్లు రాణించడంతో భారత్ 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ ప్లేయర్ ఆప్ ది మ్యాచ్గా నిలిచింది. టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు తన తర్వాతి లీగ్ దశ మ్యాచులో ఈనెల 21న యూఏఈతో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa