ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే ఆద్యులని ఆరోపించారు. దెబ్బలు, కొట్లాటలతో అల్లకల్లోల వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. అలాంటి నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు. అబద్ధాలు ఆడటం వారికి వెన్నతో పెట్టిన విద్య అని తూర్పారపట్టారు. దమ్ముంటే జగన్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేకా హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్లు.. జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడని మంత్రి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు నిజంగానే ప్రజాస్వామ్యం కోరే నాయకులైతే.. ముందుగా వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని అన్నారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరి చేసిన ఓ హంతకుడు.. ప్లకార్డులు పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. తాము కక్షపూరితంగా వెళ్లాలంటే.. తమ నాయకుడు కనుసైగ చేస్తే చాలని, తమ కార్యకర్తలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కానీ.. తమ నాయకుడు క్రమశిక్షణ నేర్పించారు కాబట్టే చట్టప్రకారం వెళ్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు దిగుతున్నారని.. టీడీపీ నేతలు సహనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే.. టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి తెలియజేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa