ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక తప్పులు చేస్తే.. భారీగా జరిమానా, జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 06:54 PM

కేంద్రం తీసుకొచ్చిన కొత్త రవాణా చట్టంపై ఏపీ పోలీసులు మరోసారి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్ల కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. వీరి వాహనాలు సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తుండగా.. న్యాయమూర్తి వీరికి రూ.10వేలు జరిమానా విధిస్తున్నారు. అదే రెండసోరి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతే ర.15వేలు జరిమానాతో పాటుగా రెండేళ్లు జైలు శిక్ష విధించేలాల చర్యలు తీసుకుంటారు.


ప్రధానంగా ఈ చట్టాన్ని అమలు చేస్తూ.. ప్రమాదాలను నివారించేలా చర్యల్లో భాగంగా జులై 1 నుంచి విధించే జరిమానాల వివరాలను.. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లకు పంపించారు. అలాగే ట్రాఫిక్‌ పోలీసులు బోర్డులు పెట్టి.. వాహనదారుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ జరిమానాల విషయానికి వస్తే.. ఎక్కడైనా ట్రాఫిక్‌లో రెడ్‌లైట్‌ పడినా వాహనం వెళితే గతంలో జరిమానా రూ. 100 ఉండేది.. ఇప్పుడు దీన్ని రూ.500 వరకు పెంచారు. గతంలో లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే రూ.500 విధించేవారు.. ఇప్పుడు దానిని రూ. 5 వేలకు పెంచారు. గతంలో అతివేగంగా వాహనాలు నడిపితే రూ.400 జరిమానా ఉండేది.. ఇప్పుడు దీనిని రూ.వెయ్యికి పెంచారు.


గతంలో ప్రమాదకరంగా వాహనాలు నడిపితే రూ.వెయ్యి జరిమానా ఉంటే.. ఇప్పుడు దీన్ని రూ.5వేలకు పెంచారు. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపితే రూ. 2 వేలు ఉండే జరిమానా.. ఇప్పుడు రూ. 10 వేలకు పెరిగింది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే గతంలో రూ.100 ఉండే జరిమానాను.. ఇప్పుడు రూ.1000కు పెంచడంతో పాటుగా మూడు నెలల లైసెన్సును రద్దు చేస్తారు. గతంలో అత్యవసర వాహనాలను నిరోధిస్తే ఎలాంటి జరిమానా ఉండేది కాదు.. ఇప్పుడు రూ. 10 వేలు జరిమానా విధిస్తారు. బైక్‌లపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే.. ఇకపై రూ.1200 జరిమానా విధిస్తారు. ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ. 2వేల జరిమానా.. సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపితే రూ. 1000 జరిమానా విధిస్తారు.


అంతేకాదు అధిక లోడ్లతో వాహనాలు నడిపితే రూ.20వేల జరిమానాతో పాటుగా.. టన్నకు రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తారు. తరచూ నిబంధనలు ఉల్లంఘించినా సరే జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ఈ విషయాలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలి అంటున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవర్‌లో దొరికినా, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై యాక్షన్ సీరియస్‌గా ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa