ఏపీలో గత వారం రోజులుగా పలు చోట్ల భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్న.. ఇలా వర్షాలకు పంట దెబ్బతినటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద సాయం మీద, పంట నష్టపోయిన రైతులకు అందించే సాయం గురించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంట నష్టం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం చేయడం లేదని వైఎస్ షర్మిల నిలదీశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.
" నేటికీ దాదాపు మూడు వారాలు, అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి. రైతుల అర్తనాధాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు, రైతులు, ప్రజలూ అల్లకల్లోలంలో కొట్టుకుపోతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుంది. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది?" అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
ఇక కేంద్రం బిహార్ రాష్ట్రానికి వరద సాయం కింద వేలకోట్ల రూపాయలు ప్రకటించిందన్న వైఎస్ షర్మిల., ఏపీకి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంటే కేంద్రానికి ఎందుకింత నిర్లక్ష్యమంటూ ప్రశ్నించారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న ఏపీలోని 25 మంది ఎంపీలు.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, నిధులు ఎందుకు తేలేదని షర్మిల ప్రశ్నించారు. విపత్తు దళాలను ఎందుకు తేలేకపోతున్నారని నిలదీశారు. వరదలు, పంట నష్టం మీద ఇప్పటికేమైనా అంచనాలు రూపొందించారా .. అసలు పంట నష్టపరిహారం మీద ఎందుకు స్పష్టత లేదని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
ఏపీలో వర్షాలు, వరదల కారణంగా 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని షర్మిల అంచనా వేశారు. ప్రతి రైతు ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి పెట్టారని.. కనీసం రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని షర్మిల అంచనా వేశారు. పంట నష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా జరిగిందన్న వైఎస్ షర్మిల.. ఇదంతా వదిలేసి కేవలం పునరావాస కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంట నష్టం గురించి, రైతుల కష్టం గురించి మెడ లోతు నీళ్లలో మునిగి కాంగ్రెస్ నాయకులం వివరిస్తే.. మా నిబద్ధతలో మీకు పావు వంతు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేయకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa