ఏలూరుకు చెందిన శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి పవన్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. 2015లో పెళ్లి జరగ్గా.. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే పెళ్లి చేసిన రెండేళ్లకు పెద్ద కూతురిని శ్రీనివాస రామానుజ అయ్యంగార్ ఇంటికి తీసుకువచ్చేశారు. అప్పటి నుంచి కాపురానికి పంపలేదు. ఇదిలా ఉన్న సమయంలోనే రెండో కుమార్తెకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరిపించాడు. విజయవాడకు చెందిన శేషసాయి అనే వ్యక్తితో రెండో కుమార్తె పెళ్లి చేశారు. అయితే రెండో కుమార్తె విషయంలోనూ రామానుజ అయ్యంగార్ ఇలాగే వ్యవహరించారు. కొన్ని రోజులకే రెండో కూతురిని కూడా పుట్టింటికి తీసుకువచ్చేశారు.
ఇక తమ భార్యలను కాపురానికి పంపాలంటూ అల్లుళ్లు ఇద్దరూ మామను కోరారు. అయితే ఆ విషయాన్ని రామానుజ అయ్యంగార్ పట్టించుకోలేదని.. పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇద్దరు అల్లుళ్లు ఆరోపిస్తున్నారు. తమ మామకు పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నాయని.. అందుకే తమకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్ను కలిసి ఇద్దరు అల్లుళ్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూతుర్లను కాపురానికి పంపించకుండా తమ మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ వేధిస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. తమపై పెట్టిన కేసులు రద్దు చేయాలని.. తమ మామ మీద చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు కలెక్టరేట్లో కు వినతి పత్రం కూడా అందించారు.
అయితే తమ విజ్ఞప్తిపై ఎలాంటి స్పందన లేదని ఇద్దరు అల్లుళ్లు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు కలెక్టరేట్ ఎదుట టెంటు వేసుకుని రిలే నిరాహార దీక్షలకు దిగారు. తన కూతురికి తన గురించి లేనిపోనివి చెప్తున్నారని.. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పేందుకు వీలు లేకుండా పోయిందని పెద్ద అల్లుడు పవన్ చెప్పారు. కూతురిని కూడా చూసుకునే వీలు లేక.. వేరే దారి లేకనే ఇలా నిరాహార దీక్షకు దిగినట్లు చెప్పారు. తమ భార్యలను కాపురానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని, తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, తమ మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa