ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎంతో మందికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కలిగింది. ఈ మేరకు బిల్లుకు ఏపీ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలు ఉండాలన్న నిబంధనను తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. నిబంధనను రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి హామీ కూడా ఇచ్చింది.
ఇక ఇదే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం కల్పించింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవతవకలపై కీలక చర్చ జరిగింది. 2014 నుంచి 2019.. 2019 నుంచి 2024 ప్రభుత్వాల్లో రూపొందించిన ఎక్సైజ్ పాలసీలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం దోపిడీ చేసేందుకే ఎక్సైజ్ పాలసీ రూపొందించిందని మంత్రవర్గం అభిప్రాయపడింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పాలసీని తొలగించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తీసుకురావాలని మంత్రివర్గం సూచన చేసింది.
ఇక గత ప్రభుత్వం మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా చేసిందని.. అందుకే జగన్ సర్కార్ తీసుకొచ్చిన 217 జీవోను కూడా రద్దు చేస్తూ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ ఆమోదం కల్పించింది. మరోవైపు.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో, పేరు ఉన్న సర్వే రాళ్లపై వాటిని తొలగించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీ-సర్వే ప్రక్రియను నిలుపుదలలో పెట్టాలని కెబినెట్ నిర్ణయించింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa