ప్రముఖ అంతర్జాతీయ కూల్డ్రింక్స్ సంస్థ కోకాకోలా.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఐదేళ్లకు ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇండియా, సౌత్, వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ టి.కృష్ణకుమార్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న కోకాకోలా.. తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో అన్ని ఐసీసీ టోర్నీలకు కోకాకోలా ప్రచారకర్తగా ఉంటుందని తెలిపారు. ఈ ఒప్పందం విలువ మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఈ ఒప్పందంతో ఈ ఏడాది ఇంగ్లండ్లో జరిగే పురుషుల వన్డే ప్రపంచకప్ సహా 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళలు, పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నీలకు భాగస్వామిగా కోకాకోలో వ్యవహరించనుంది. ‘ మా భాగస్వామిగా ఉండేందుకు ముందుకొచ్చిన కోకాకోలా సంస్థను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వందల కోట్లలో అభిమానులున్న క్రికెట్కు కోకాకోలా ఐదేళ్ల భాగస్వామిగా ఉండేందుకు ముందుకురావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ అన్నారు. 2015 ఐసీసీ ప్రపంచ కప్కు కూడా కోకాకోలా స్పాన్సర్గా వ్యవహరించింది.
2019, 2020లో ఐసీసీ మేజర్ టోర్నీలను నిర్వహించనుంది. ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా పురుషుల ప్రపంచ కప్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో మహిళల టీ20 ప్రపంచకప్, అక్టోబరు-నవంబరులో పురుషుల ప్రపంచకప్ జరగనుంది. ఈ రెండు టోర్నీలు ఆస్ట్రేలియాలోనే నిర్వహిస్తున్నారు. పురుషుల టీ20 ప్రపంచకప్ ఒకే ఏడాదిలో, ఒకే దేశంలో జరగడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa