అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. నూతన మద్యం విధానంలో మద్యం రేట్లు భారీగా తగ్గనున్నాయి. మరోవైపు కొత్త మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు తుది దశకు చేరుకుంది. నూతన మద్యం విధానం తయారీ కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బృందాలు ఆరు రాష్ట్రాల్లో పర్యటించాయి. తమిళనాడు, కేరళ, రాజస్థాన్, యూపీ, తెలంగాణ, ఢిల్లీలలో అనుసరిస్తున్న మద్యం విధానాలు, మద్యం రేట్లు, నాణ్యతపైనా అధ్యయనం చేశాయి. ఈ అధ్యయనాల ఆధారంగా నూతన మద్యం పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీపై కార్యాచరణ రూపొందించాయి. మరో రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు నివేదిక సమర్పించనున్నారు.
మరోవైపు ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో తెస్తామని చంద్రబాబు సహా కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నూతన మద్యం విధానంలో మద్యం రేట్లు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అన్ని ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతివ్వాలని యోచిస్తోంది. ఆగస్ట్ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలోగా అన్ని ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ బాటిల్ మద్యాన్ని వంద రూపాయలలోపే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వం హయాంలో క్వార్టర్ బాటిల్ మద్యం సుమారుగా 200 రూపాయలు వరకూ ఉండేది. దీంతో తక్కువ ధరకు మందు అందుబాటులో లేకపోవటంతో యువత గంజాయి, మత్తుపదార్థాల వైపు చూశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని క్వార్టర్ బాటిల్ ధర రూ.80-90 లోపే నిర్ధారించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి కసరత్తు వీలైనంత త్వరగా పూర్తిచేసి అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం, అధికారులు అడుగులు వేస్తున్నారు. నూతన మద్యం విధానంలో మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గౌడ, ఈడిగ కులాలకు రిజర్వేషన్లు కూడా కల్పించే ఆలోచనలో ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa