ఏపీ మంత్రి నారా లోకేష్ సారీ చెప్పిన.. సమస్య పరిష్కారమైంది. సమస్యను పరిష్కరించిన అధికారులు.. ఈ విషయాన్ని నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరించినందుకు నారా లోకేష్ వారిని అభినందించారు. అసలేమైందంటే.. కర్నూలు పట్టణానికి చెందిన అభిషేక్ అనే వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో మురికి నీరు ప్రవహిస్తూ అపరిశుభ్రంగా ఉందంటూ ప్రజాదర్బారులో ఫిర్యాదు చేశారు. అయితే సమస్య పరిష్కారం కాకముందే పరిష్కరించినట్లు సందేశం వచ్చిందంటూ అభిషేక్.. మంత్రి నారా లోకేష్కు ట్వీట్ చేశారు. వివరాలన్నీ జోడిస్తూ నారా లోకేష్ను ట్యాగ్ చేశారు. తన ఇంటి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందంటూ ప్రజాదర్బారులో వినతి పత్రం ఇచ్చానని.. అయితే పరిష్కారం కాకుండానే.. సమస్య పరిష్కారం అయ్యిందంటూ ఆగస్ట్ 9న కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చినట్లు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇలాంటి వాటి మీద కొంచెం శ్రద్ద చూపాలని .. దీనికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అభిషేక్ ట్వీట్కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అధికారుల తప్పిదానికి తన విభాగం తరుఫున తాను క్షమాపణలు చెప్తున్నానన్నారు. ఈ విషయం మీద తన టీమ్ మాట్లాడుతుందన్న నారా లోకేష్.. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సంగతిని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావటంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అభిషేక్ ఇంటి వద్ద ప్రవహిస్తున్న మురికి నీటి సమస్యను పరిష్కరించారు. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కర్నూలు నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఉల్చాల రహదారిలో ఉన్న స్కంద లోటస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలో అన్నివైపులా ప్రహరీ గోడలు నిర్మించుకున్నారనీ.. దీంతో మురికి, వర్షం నీరు బయటకు వెళ్లడానికి లేకుండాపోయిందన్నారు. నిర్మాణాలు జరిపిన ప్రైవేట్ ఏజెన్సీ వ్యక్తులు ప్రధాన కాలువలు నిర్మించలేదన్న కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది.. దీంతో మురికి నీరు రోడ్డుపైకి చేరినట్లు చెప్పారు.
కొత్తగా నిర్మిస్తున్న ఈ ప్రాంతంలో ఇంకా పూర్తిస్థాయిలో రహదారులు, కాలువలు, ఇళ్లు నిర్మాణం కాలేదని.. దీంతో డ్రైనేజీ కాలువల కోసం సరైన ప్రణాళిక లేదని నారా లోకేష్కు వివరించారు. దీంతో సుమారుగా 1.70 కిలోమీటర్ల వరకూ కచ్చ కాలువ నిర్మించి.. గల్ఫర్ ద్వారా మురుగు నీటిని తొలగించామని వివరించారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం సర్వే చేయించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది లోకేష్కు తెలియజేశారు. దీనిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa