సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి దంపతులు శనివారం అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోయలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరి గ్రామదర్శినిని సందర్శించిన దంపతులు.. గిరిజన ఆచార, సంప్రదాయాల ప్రకారం మరోసారి వివాహం చేసుకొని కొత్త అనుభూతి పొందారు. ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం బంధుమిత్రులు, స్థానిక గిరిజనులు, అధికారుల సమక్షంలో జస్టిస్ జేకే మహేశ్వరి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ తంతును గిరిజన పెద్దల చేతుల మీదుగా జరగడం విశేషం.
ఏజెన్సీ సందర్శన నిమిత్తం శనివారం కుటుంబ సమేతంగా విశాఖపట్నం నుంచి రైలులో అరకులోయ చేరుకున్న జస్టిస్ మహేశ్వరికి.. జేసీ ఎంజే అభిషేక్గౌడ్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ స్వాగతం పలికారు. ముందుగా అరకు లోయలోని గిరిజన మ్యూజియం, కళా గ్రామం సందర్శించారు. అనంతరం పెదలబుడు పంచాయతీలోని గిరి గ్రామదర్శినిని సందర్శించారు. అక్కడ గిరిజన సంప్రదాయం ప్రకారం వస్త్రాలను ధరించి జస్టిస్ మహేశ్వరి దంపతులు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకను జరిపించిన గిరిజన పెద్దలను జస్టిస్ దంపతులు అభినందించారు.
ధింసా కళాకారులతో నృత్యం చేసి.. అక్కడ నుంచి అనంతగిరి మండలంలో గల బొర్రా గుహలను సందర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ.. అరకులోయ ప్రకృతి సోయగాలు అద్భుతంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడం కొత్త అనుభూతిని మిగిల్చిందని ఆయన ఆయన అన్నారు.
జస్టిస్ జేకే మహేశ్వరి వెంట విశాఖ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఆలపాటి గిరిధర్, పోక్సో కోర్టు జడ్జి ఆనంది, అదనపు జిల్లా జడ్జి గోవర్ధన్, గాజువాక సీనియర్ సివిల్ జడ్జి రాజేంద్రబాబు, రెండో అదనపు సివిల్ జడ్జి సోని, మూడో అదనపు సివిల్ జడ్జి కార్తీక్, అనకాపల్లి ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి రమేష్, చోడవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి స్వర్ణ, రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ అనురాగ్తో పాటు అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ ధీరజ్, డీఆర్ఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa