జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో జన్మించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి ఆపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని నిడమర్రు మండలం, పెద్ద నిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేష్, జోష్న దంపతులకు ఇటీవలే ఓ బిడ్డ జన్మించింది. అయితే ఆ సంతోషం వారికి ఎంతోసేపు నిలవలేదు. శిశువు అనారోగ్యానికి గురైంది. పరీక్షలు జరిపిన డాక్టర్లు శిశువు గుండెకు రంధ్రం ఉందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని.. లేకుంటే ప్రాణాలకు ప్రమాదమని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. ఏం చేయాలో తోచని పరిస్థితి. పేగు బంధాన్ని కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారి ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆశ్రయించారు.
సురేష్ దంపతుల కష్టం విన్న శ్రీనివాస్ వెంటనే స్పందించారు. ఆ పసికందును కాపాడుతానని అండగా నిలిచారు. వెంటనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆస్పత్రిని సంప్రదించారు. వారికి ఈ విషయం వివరించి.. శిశువు కావాల్సిన ఆపరేషన్ చేయించారు. సుమారు ఏడు నుంచి 10 లక్షల వరకూ ఖర్చయ్యే ఆపరేషన్ను ఎమ్మెల్యే.. స్విమ్స్ వైద్యులతో మాట్లాడి ఉచితంగా చేయించారు. దీంతో ఆ పసికందు ప్రాణం నిలబడింది. దీంతో సురేష్ దంపతులు.. జనసేన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్వరమే స్పందించి చిన్నారి ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
అయితే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల కూడా ఇలాగే ఓ చిన్నారికి అండగా నిలిచారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అనాథ బాలికకు.. ఎమ్మె్ల్యేగా తాను అందుకున్న తన తొలి జీతం విరాళంగా అందించారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో దంపతులు ఇద్దరూ చనిపోయారు. వారి కుమార్తె ఒంటరిగా మిగిలిపోయింది. కన్నవాళ్లు దూరం కావటంతో ఆ పాప బాగోగులు చూసేవారు కరవయ్యారు. దీనికి తోడు ఇదే ప్రమాదంలో ఆ బాలిక కూడా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ చలించిపోయారు. ఆ బాలికకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే బాలిక బాగోగుల కోసం ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతం మొత్తాన్ని బాలిక కుటుంబసభ్యులకు అందజేశారు. దీంతో బొలిశెట్టి చేసిన పనిపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa