ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై మళ్లీ కొవిడ్ పడగ.. సిద్ధంగా ఉండాలని నిపుణుల హెచ్చరికలు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 10:16 PM

ప్రపంచ దేశాలను కొన్నేళ్ల పాటు తీవ్ర భయాందోళనలకు గురిచేసిన కొవిడ్ మహమ్మారి మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు తాజాగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ మరో కోవిడ్ వ్యాప్తికి సిద్ధంగా ఉండాలని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నిపుణులు ఒకరు శుక్రవారం హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికాతో పాటు దక్షిణ కొరియా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేశారు. సీడీసీ అంచనాల ప్రకారం.. అమెరికాలోని 25 రాష్ట్రాల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణ కొరియాలో కూడా కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతుండటం ప్రపంచ దేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ -డబ్ల్యూహెచ్ఓ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 24వ తేదీ నుంచి జూలై 21వ తేదీ మధ్య.. ప్రపంచంలోని 85 దేశాల్లో ప్రతీ వారం సగటున 17,358 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో భారత్‌లో 908 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ ఏడాది జూన్-జూలై నెలల మధ్య ఇద్దరు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. అయితే ప్రపంచలోని ఇతర దేశాల మాదిరిగా భారత్‌లో అంత తీవ్రమైన పరిస్థితి లేనప్పటికీ.. భారత్ కూడా మరో కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నోయిడాలోని శివ్ నాడార్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ దీపప్ సెహగల్ పేర్కొన్నారు. కరోనా వైరస్ కచ్చితంగా తిరిగి పుంజుకుంటుందని.. ఈ వైరస్ సోకిన వారిలో 26 శాతం మరణాలు, 11 శాతం కేసుల పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్ఓ నివేదించింది. ఇది తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయమని చెప్పారు.


ఇక ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్ వ్యాప్తిలో కేపీ వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది ఒమిక్రాన్ వంశానికి చెందిందని తెలుస్తోంది. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు రోగనిరోధక శక్తిని తప్పించుకునే లక్షణం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ జేఎన్.1 నుంచి కేపీ 2 వేరియంట్ పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. ఇక భారత్‌లో కేపీ 2 కరోనా వేరియంట్‌ను తొలిసారిగా డిసెంబర్ 2023 ఒడిశాలో కనుగొన్నారు.


ఇక కేపీ 2 జాతి ఒమిక్రాన్ వేరియంట్ నుంచి స్పైక్ రీజియన్‌లో 3 మ్యుటేషన్లను కలిగి ఉంటుందని నిపుణులు చెప్పారు. ఇన్సాకాగ్ ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం) నుంచి అందిన సమాచారం ప్రకారం.. కేపీ 2 వేరియంట్ ఇప్పటికే భారత్‌లో ఉందని వెల్లడైంది. కేపీ ఎక్స్‌లో KP.3.1.1.. ఫ్లిర్ట్ వేరియంట్ లేదా KP.2 వంటి రకరకాల వేరియంట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక జూలై చివరి వారంలో భారత్‌లో సేకరించిన మొత్తం కొవిడ్ సీక్వెన్స్ శాంపిల్స్‌లో దాదాపు 39 శాతం ఈ కేపీ2 వేరియంట్ కేసులు ఉన్నట్లు తెలిసింది. భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదల ఉన్నట్లు.. కేంద్ర ఆరోగ్య శాఖ కొవిడ్ డాష్ బోర్డులో చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం దేశంలో 279 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జేఎన్ 1 ఓమిక్రాన్ నుంచి ఉద్భవించిన కేపీ1, కేపీ2 జాతులు భారత్‌లో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణం అని గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa