ఆంధ్రప్రదేశ్లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. అది కూడా పెళ్లయిన ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శారద నర్సింగ్ హోంలో ఈ అరుదైన కాన్పు జరిగింది. డాక్టర్ గిరిబాల, డాక్టర్ శ్రావ్య బృందం ఆ తల్లికి శస్త్ర చికిత్స చేసి.. ముగ్గురు పిల్లలకు పురుడు పోశారు.
రాజనగరం మండలం పాత తుంగపాడు గ్రామానికి చెందిన ఆలపాటి సంధ్యా కుమారి, వీరబాబు దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా.. సంతానం కలగలేదు. ఈ ఐదేళ్లలో కనిపించిన దేవుళ్లందరికి మొక్కుతూ, తమకు తెలిసినా, బంధువులు చెప్పిన ఆస్పత్రులన్నింటికీ తిరిగి చికిత్స తీసుకున్నా.. సంధ్యా కుమారి కడుపు మాత్రం పంలేదు. అయినా.. పిల్లలు కావాలన్న ఆ దంపతుల కోరికతో.. రకరకాల ఆస్పత్రులకు వెళ్తున్న క్రమంలో.. రామచంద్రపురం బ్రాడీపేటలో ఉన్న శారద నర్సింగ్ హోంలో చూపించుకున్నారు.
డాక్టర్ గిరిబాల వద్ద పరీక్షలు చేయించుకుని.. కొద్ది రోజులుగా మందులు వాడారు. దీంతో.. సంధ్య కుమారి గర్భం దాల్చింది. గర్భవతి అయిన సంధ్య కుమారి.. తొమ్మిది నెలల పాటు జాగ్రత్తగా ఉంటూ.. వైద్యులు చెప్పినట్టుగా నడుచుకుంది. డెలవరీ సమయం దగ్గర పడటంతో.. నార్మల్గా ప్రయత్నించినప్పటికీ సాధ్యకాకపోవటంతో.. ఆపరేషన్ చేసారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్లకు సంధ్యారాణి జన్మనిచ్చింది.
తల్లి పిల్లలు క్షేమంగానే ఉన్నారని డాక్టర్ గిరిబాల తెలిపారు. ముగ్గురు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని.. ఉండవల్సిన బరువుతోనే పుట్టారని వైద్యులు తెలిపారు. పిల్లలు కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగి అలసిపోయి నిరాశ చెందిన ఆ దంపతులకు.. శారద నర్సింగ్ హోం డాక్టర్ గిరిబాల.. ధైర్యం చెప్పి మంచి వైద్యం అందించటంతోనే.. తమకు పిల్లలు కలిగారంటూ వీరబాబు సంధ్య కుమారి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ గిరిబాలాకు ఆ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కరైనా చాలు అనుకున్న ఆ దంపతులకు ఒకే కాన్పులో త్రిబుల్ ప్యాక్గా ముగ్గురు సంతానం కలగటంతో.. వారి ఆనందానికి అవదులే లేవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa