ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా హిందూపురం ప్రసిద్ధి. కర్ణాటక రాజధాని బెంగళూరు దగ్గరగా ఉండటంతో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారింది. అయితే అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉంది. పట్టణంలోని ప్రముఖ ప్రాంతాలైన టీచర్చ్ కాలనీ, హౌసింగ్బోర్డు, కరెంటు రంగప్ప లే అవుట్, డీఆర్ కాలనీ, శ్రీకంఠపురం పాత ఊరు, సీపీఐ కాలనీ పక్కన తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసిందంటే నరకం అనుభవిస్తున్నారు. ఇళ్లకు వెళ్లే దారులు బురదమయమై ద్విచక్రవాహనాలు కాదు కదా, కనీసం కాలినడకన వెళ్లలేని పరిస్థితి దాపురిస్తుంది. ఇది ఇలా ఉంటే... పలు ప్రాంతాల్లో ఇప్పటికీ డ్రైన్లు లేక మురుగునీరు రోడ్లపైకి వదిలేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు దుర్గందభరితమై ఉంటాయి. వర్షం కురిసినప్పుడు వర్షం నీటితో కలిసి మురుగు కలిసిపోయి రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో మురుగునీరు నిలువ ఉండి దోమలకు నిలయాలుగా మారుతాయి. పరిసర ప్రాంత ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. అతి చిన్న పట్టణాలైన మడకశిర, పెనుకొండల్లో రోడ్లు వెడల్పు చేసినా, హిందూపురంలో అందుకు నోచుకోలేదు. ఇదిలాఉంటే ఆర్అండ్బి రోడ్లు, మునిసిపల్ రోడ్లు గుంతలమయమై పూర్తిగా అధ్వానంగా మారాయి. కొత్త వారు ఎవరైనా ఒక్క సారి హిందూపురంలో ప్రయాణిస్తే భయపడక తప్పదు. ముక్కుపిండి పన్నులు వసూలు చేసే మునిసిపల్ అధికారులు రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయరా అని ప్రజలు నిలదీస్తున్నారు. పురం వైసీపీ పాలకుల నిర్లక్ష్యం పట్టణ ప్రజలకు శాపంగా మారిందని నిందిస్తున్నారు. అభివృద్ధిపై కౌన్సిల్ సమావేశాల్లోనూ ప్రశ్నించారు. అయితే నిధులు రాకపోతే తామేమి చేయాలని సమాధానాలు చెప్పడం వారివంతైంది. ఇప్పుడు టీడీపీ కూటమి పాలకులైనా హిందూపురం అభివృద్ధిపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa