సరిగ్గా రెండు వారాల కిందట బుడమేరుకు పోటెత్తిన వరద విజయవాడ నగరాన్ని ముంచేసింది. దాదాపు 10 రోజులు పాటు నగరంలోని అనేక ప్రాంతాలు ముంపులోనే ఉండిపోయాయి. బుడమేరుకు గండ్లు పూడ్చటం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే నగరం కోలుకోంటోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ బుడమేరుకు వరద పోటెత్తిందని, ఇళ్లను ముంచెత్తనుందంటూ శనివారం రాత్రి ప్రచారం జరగడంతో బెజవాడ ప్రజలు బెంబెలేత్తిపోయారు. అర్ధరాత్రి వేళ భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఉరుకులు పరుగులు పెట్టారు. బుడమేరు నీరు కొద్దిసేపట్లో మళ్లీ ఇళ్లల్లోకి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
దీంతో అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, తోటవారి వీధి, అంబాపురం, భరత మాత కాలనీ తదితర ప్రాంతాలకు జనం భయంతో ఇళ్లనుంచి బయటకు వచ్చి.. ఇతర ప్రాంతాల్లోని ఉండే తమవారికి ఫోన్లు చేసి ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు తమ బంధువులు, స్నేహితులకు సమాచారం ఇచ్చారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో మళ్లీ వరద వస్తే తమ పరిస్థితి ఏంటి? అని ఆయా ప్రాంతాల ప్రజలు భయపడిపోయారు. కొందరైతే ఇళ్లలోని సామాగ్రిని తీసుకుని బయటకు వచ్చేశారు.
దీనిపై సమాచారం అందుకున్న కలెక్టర్ డాక్టర్ సృజన, మంత్రి నారాయణ స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కలెక్టర్ తోపాటు అధికారులు తేల్చారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ఇటువంటి వదంతులను వ్యాపింపచేసిసినట్టు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుడమేరుకు ఎలాంటి వరదలేదని, పుకార్లు నమ్మొద్దని ప్రజలకు సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఐ కృష్ణమోహన్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి గండి పడిందంటూ వచ్చే వదంతులను నమ్మవద్దని మైక్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, నగరంలోని పలు ప్రాంతాలకు మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం వదంతులు మాత్రమేనని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. న్యూ రాజరాజేశ్వరీపేట, జక్కంపూడి కాలనీలతో పాటు వివిధ ప్రాంతాల్లో వరద వస్తోందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనే ప్రచారంలో నిజం లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. విజయవాడ నగరం పూర్తి భద్రంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
వాస్తవానికి వరదలు వచ్చి రెండు వారాలు గడిచినా అంబాపురంలో నీరు తగ్గలేదు. దీంతో అధికారులు ఇన్నర్ రింగ్రోడ్డుకు గండి కొట్టి నీటిని మళ్లించారు. ఈ నీటిలో కొంత రాధానగర్, ఉడా కాలనీ వైపు రావడంతో బుడమేరుకు వరద అంటూ ప్రచారం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa