తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్ఏడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఇలాంటి నేతిని వినియోగించిన లక్ష లడ్డూలను అయోధ్య రామ జన్మభూమి మందిరానికి టీటీడీ పంపి చాలా పెద్ద తప్పు చేసిందని అన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రతి హిందువూ, ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి దీన్ని ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వేంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన ఆదివారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష మాలధారణ తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... కేబినెట్, అసెంబ్లీలో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జగన్ వారిని ఎలా సమర్థిస్తారు? కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? దోషులకు శిక్ష పడాల్సిందే. చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేది. ప్రపంచం అంతా మాట్లాడేది. గ్లోబల్ న్యూస్ అయ్యేది. అదే హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? సెక్యూలర్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందా? హిందువులకు మనోభావాలు ఉండవా? ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను. తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటావా? మరి తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదని అంటున్నారు? మేము మాట్లాడతాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం. సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడుతాను.
తిరుమల ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి. నిన్న మీడియా ప్రతినిధులు సీబీఐ విచారణకు ఈ కేసు తీసుకువెళ్తారా అని అడిగారు. కేబినెట్లో చర్చ జరిగే విధంగా చూసి, దీనిపై నిర్ణయం తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహకరిస్తాం. తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో జరగకుండా చూేసలా మా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని పవన్ స్పష్టం చేశారు. ‘‘నెయ్యి కల్తీపై గత టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి. నాటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర పాలక వర్గంపై విచారణ జరగాలి. తప్పులు చేస్తే మాది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. టీటీడీ బోర్డు ఉన్నది ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమే. దర్శనం టికెట్లు మీ వారికి ఇచ్చుకోవడానికో, మీ ఇష్టానికి కాంట్రాక్టులు ఇవ్వడానికో కాదు’’ అని పవన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa