కడియంలో చిరుతపులి సంచారంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం కడియం వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అటవీశాఖ అధికారులను ఆరా తీశారు. పులి సంచారంపై వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు భయాందోళనలు లేకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. రైతు తిరుమలశెట్టి భాస్కరరావు నర్సరీ నుంచి చెక్కపల్లి సత్తియ్య చేను వైపు చిరుతపుల్లి వెళ్ళినట్లు పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతపులి కదలికలను గుర్తించడానికి ట్రాప్ కెమేరాలు, సీసీ కెమేరాలు అమర్చినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ఎస్. భరణి తెలిపారు.
ఆయన వివరాల ప్రకారం...కడియం నుంచి వీరవరం వెళ్ళే రోడ్డులో దోసాలమ్మకాలనీ దగ్గరలోనున్న ఎన్ఎస్టీసీ నర్సరీలో చిరుతపులి పాదముద్రలు గుర్తించామన్నారు. అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా వాటి ఆనవాళ్లు పోయాయన్నారు. గతంలో వరదల సమయంలో గోదావరి మీదుగా వచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. బుర్రిలంక సమీపంలో గోదావరి లంకల్లో జింకలు ఉండటంతో అటువైపుగా వెళుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. చిరుతపులి కదలికలను గుర్తించడానికి సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు కడియం నర్సరీ అసోసియేషన్తో సమావేశం అయ్యారు. నర్సరీ సంఘం అధ్యక్షుడు మల్లు పోలరాజు, కార్యవర్గ సభ్యులతో మాట్లాడారు. నర్సరీల్లో పనిచేసే కార్మికులు ముగ్గురు లేదా నలుగురు కలిసి వెళ్ళాలన్నారు. చేతిలో కర్ర, టార్చ్లైటు దగ్గర ఉంచుకోవాలన్నారు. ఇరుకు షెడ్లు ఉన్న నర్సరీ రైతులు ముందుగా టార్చ్లైటుతో అంతా పరిశీలించి తరువాతే షెడ్డు తాళం తీయాలని సూచించారు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై పోలీసుశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa