ఏపీలో మరో రెండు రోజుల పాటు వానలు కురవనున్నాయి. వచ్చే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం రోజున పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఈ జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాలు ,కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా ,గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని రోజులు వానలు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. ఈ రెండు అల్పపీడన ద్రోణుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది. ఏపీ, తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అక్టోబరు 7, 8 తేదీల్లో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని సైతం స్కైమెట్ అంచనా వేసింది. ఇక అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయన్న స్కైమెట్.. పలుచోట్ల మెరుపులతో కూడిన ఉరుములు, వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్కరాష్ట్రాలపైనా ఉండనుంది. ఈ విషయాన్ని స్కైమెట్ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటుగా ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రపై ఈ తుపాను ఉంటుందని స్కైమెట్ పేర్కొంది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతంతో పాటుగా దాని పరిసరాల్లో మరో అల్పపీడనం విస్తరించి ఉందన్న స్కైమెట్.. పశ్చిమ బంగాల్, బిహార్, ఝార్ఖండ్ మీదుగా ఈ అల్పపీడనం కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa