షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా అంటూ వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వైయస్ జగన్ మళ్లీ సీఎం కాకూడదనే అజెండాతోనే షర్మిల పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికి ప్రజల ముందుకు వచ్చానని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెబుతున్నది ఆవాస్తవమని, ఆమె సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే ఈ పని చేస్తున్నారని, ఇది అసలు ఆస్తి తగాదా కానేకాదని, అధికారం కోసం చేస్తున్న వివాదం అని వైయస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత శ్రీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
తన అన్న జగన్ మళ్లీ సీఎం కాకూడదన్న ఎజెండాతోనే ఆమె పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉంటే, ఇక్కడ అదే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, అదే ఎన్డీఏకు అనుకూలంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారకుడని అనేకసార్లు చెప్పిన షర్మిల, ఇప్పుడు అదే చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని శ్రీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. తల్లి, చెల్లిని మోసం చేసిన జగన్, ప్రజలకు ఏం చేస్తాడని షర్మిల ప్రశ్నించడం తగదని ఆయన మండిపడ్డారు. తల్లి, చెల్లిని జగన్ మోసం చేశాడంటూ అదే పనిగా ప్రచారం చేయాలని షర్మిలకు చంద్రబాబు బ్రాండింగ్ ఇచ్చాడని, ఆ అజెండానే అమలు చేస్తూ, ఆయన్ను నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని ఆక్షేపించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు దాదాపు కోటిన్నర కుటుంబాలకు సంక్షేమం, 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా, 40 లక్షలకు పైగా తల్లులకు అమ్మఒడి ఇచ్చిన సంగతి షర్మిల మర్చిపోయారా? అన్న శ్రీ విజయసాయిరెడ్డి, మహిళా సంక్షేమం కోసం ఇంతగా పాటుపడిన సీఎంను గతంలో ఎక్కడైనా చూశామా? అని ప్రస్తావించారు. జగన్ మీద మహిళల్లో వ్యతిరేకత పెంచాలన్న దుర్భుద్ధితో చంద్రబాబు తెలివిగా షర్మిలను వాడుకుంటున్నాడని చెప్పారు. కలలో కూడా మహిళలకు అన్యాయం చేయని జగన్పై చంద్రబాబు ఎన్ని కుట్రల చేసిన ప్రజల నమ్మబోరని స్పష్టం చేశారు. అందుకే షర్మిల ఆత్మవిమర్శ చేసుకుని, అంతరాత్మ సాక్షిగా ఆలోచించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa