ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గళమెత్తింది. ఐదు నెలల కూటమి ప్రభుత్వ పాలనా కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న 77 అకృతాలు, అఘాయిత్యాలపై జాతీయ మహిళా కమిషన్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాలపై వైయస్ఆర్ సీపీ ఎంపీలు గుమ్మా తనూజా, గురుమూర్తి, ఎమ్మెల్సీ, వైయస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగాధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ ఎంపీలు జి మాధవి, చింతా అనురాధలు జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవహక్కుల కమిషన్కు పూర్తి నివేదికను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన ఘటనలపై మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు, ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్డబ్ల్యూసీ, ఎన్హెచ్ఆర్సీలు జోక్యం చేసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న సందర్భంలో రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు పాలనలో కామ నరకాసరుల వధ జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఇసుక, మద్యంలో కమిషన్లు, వాటాలు పేరుతో సొమ్ము చేసుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నారని మండిపడ్డారు.ముచ్చుమర్రి ఘటనలో హత్యకు గురైన మూడు నెలల కావస్తున్నా బాలిక మృతదేహాన్ని ఈరోజుకు కనిపెట్టలేకపోవడం సిగ్గు చేటన్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నివాసం ఉన్న గుంటూరు జిల్లాలో టీడీపీ చెందిన నవీన్.. సహన అనే యవతిపై దాడి చేయడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందగా, బద్వేల్ లో బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని, హోమ్ మంత్రి పొరుగు నియోజకవర్గం రాంబిల్లిలో యువతిని కత్తితో పొడచి చంపగా, ముఖ్యమంత్రి బావమరిది బాలకృష్ణ సొంత నియోజకవర్గంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగినా కనీస చర్యలు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మదనపల్లెలో పేపర్లు తగలబెడితే డీజీపీని హెలికాప్టర్ లో పంపిన చంద్రబాబు, ఆడపిల్లలకు అఘాయిత్యాలు జరిగితే చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాలిన చిత్తు కాగితాలకు ఉన్న విలువ, మహిళల మాణ ప్రాణాలకు లేవా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు టీవీ షోలలోనూ, సినిమా షూటింగ్లతోనూ పక్క రాష్ట్రంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. అయితే బాధ్యత గల ప్రజానేతగా ఆయా సంఘటనల్లో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డంతో పాటు మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పరిహారం కూడా అందించారని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa