ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖలిస్తానీలపై దాడుల వెనుక అమిత్ షా.. కెనడా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2024, 12:06 AM

భారత్‌పై మరోసారి కెనడా అక్కసు వెళ్లగక్కింది. ఈసారి ఏకంగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా లక్ష్యంగా చేసుకుని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలకు దిగింది. కెనడా గడ్డపై ఖలిస్థానీ మద్దతుదారులపై జరుగుతున్న నేరాలు, దాడులు, హత్యల వెనుక అమిత్ షా హస్తం ఉందని ఏకంగా కెనడా మంత్రి పేర్కొనడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఏకంగా ఆ దేశ పార్లమెంటులోనే భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హై కమిషనర్ పేరును ప్రస్తావించడం మరింత దుమారానికి కారణం అయింది. ఇప్పుడు ఏకంగా అమిత్ షా పైనే ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.


కెనడాలో ఉంటున్న సిక్కు వేర్పాటువాదులను భారత హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని.. కెనడా విదేశాంగ శాఖ ఉపమంత్రి డేవిడ్ మోరిసన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కెనడాలోని ఖలిస్తానీ వాదులపై దాడులు, హింస వెనక అమిత్ షా హస్తం ఉందని ఆరోపించింది. అంతేకాకుండా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌.. కెనడాలో తదుపరి కార్యకలాపాలను నిర్వహించకుండా అడ్డుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది.


ఇక కెనడా మంత్రి ఏకంగా అమిత్ షాపైనే ఆరోపణలు చేయడంపై భారత ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కెనడా ప్రధాని తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని అని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన కెనడియన్ స్టాండింగ్ కమిటీ విచారణలో మాట్లాడిన డేవిడ్ మోరిసన్.. తనకు జర్నలిస్ట్‌లు ఫోన్ చేసి.. ఈ దాడుల వెనుక అమిత్ షా ఉన్నారా..? లేదా..? అడిగారని.. అందుకు తాను స్పందించి ఉన్నాడని ధృవీకరించినట్లు డేవిడ్ మోరిసన్ స్పష్టం చేశారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిఘా, దాడులకు అమిత్ షా అధికారం ఇచ్చారని.. కెనడా అధికారులు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్‌ పేర్కొంది.


కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని.. కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్‌ పేర్కొన్నారు. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారని.. హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టుకు లీక్‌ చేసినట్లు ఆమె అంగీకరించారు.


ఈ విషయాలు చెప్పేందుకు.. వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు సమాచారాన్ని లీక్‌ చేయడానికి ప్రధాని జస్టిన్ ట్రూడో అనుమతి అవసరం లేదని తెలిపారు. ఇక అక్టోబర్‌ 14వ తేదీకి ముందు తాను వాషింగ్టన్‌ పోస్ట్ పత్రికకు వెల్లడించిన సమాచారం సీక్రెట్‌ ఏమీ కాదని నటాలియా డ్రౌయిన్ సదరు ప్యానల్‌కు వెల్లడించారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకున్న చర్యలు కూడా అందులో ఉన్నాయని పేర్కొన్నారు. కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆధారాలను భారత్‌కు వెల్లడించినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa