ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్లో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరించనున్నట్టు ప్రకటించారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జీరో పావర్టీ (అసమానతల తొలగింపు), ఉద్యోగాల సృష్టి, నైపుణ్యత పెంపుదల, రైతు సాధికారత, ఆదాయం పెంపు, తాగు నీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల నిర్వహణతో పాటు వినియోగం, శక్తి వనరుల నిర్వహణతో పాటు వినియోగం, అన్ని రకాల సాంకేతిక జ్ఞానం పెంపుదలతో పాటు పరిశోధన లాంటి పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు.
ఇప్పటివరకు పీపీపీ విధానం వల్ల సంపద సృష్టి జరిగిందని.. ఇప్పుడు పీ-4తో అవే ఫలితాలు సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానానికి నాంది పలుకుదామని చెప్పుకొచ్చారు. రతన్ టాటా హబ్గా ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. డ్రోన్ దీదీలో భాగంగా ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.8 లక్షల సాయంతో పాటు డ్రోన్ వినియోగంపై అవగాహన కల్పిస్తామని చెప్పుకొచ్చారు.
భవిష్యత్తును అంచనా వేస్తూ కలెక్టర్లు, అధికారులు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మానవ వనరుల వినియోగంలో 2047 నాటికి ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఇండియా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. సంపద సృష్టికి, అభివృద్ధికి డబ్బు కన్నా మంచి ఆలోచన ముఖ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
విశాఖ మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్రణాళిక, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో గ్రోత్ హబ్, రోడ్ల అనుసంధానం తదితర అభివృద్ధి పనుల్లో పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులంతా హార్డ్ వర్క్ కాకుండా.. స్మార్ట్ వర్క్ చేయాలని తెలిపారు. విశాఖలో పర్యాటకం అభివృద్ధికి పెద్ద పీట వేయాలని తెలిపారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు వేసేందుకు ప్లాన్ చేయాలని వివరించారు. హైదరాబాద్ మాదిరిగానే విశాఖ పట్నంను కూడా అభివృద్ధి చేయాలని అధికారులు సూచించారు. విశాఖ జనాభా ప్రస్తుతం సుమారు 26 లక్షలు ఉందని పేర్కొన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్ర జిల్లాలను అనుసంధానం చేస్తూ కోటి వరకు జనాభా పెరగాలన్నారు.
2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం.. 15 శాతం వృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు సూచించారు. 2025 లేదా 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే నాటికి అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. టాటా, జీఎంఆర్ లాంటి సంస్థలను మెంటార్లుగా తీసుకొని ముందుకు సాగాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa