టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ – రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఉదయం అల్పాహారం కోసం – రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం – రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం – రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.
విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు. తిరుమల, తిరుపతిలలో ప్రస్తుతం అన్నప్రసాదాలు వితరణ చేస్తున్న ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్మెంట్లు, బయటి క్యూలైన్లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.
తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.ప్రస్తుతం టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల, తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తోంది. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచించింది. ఈ మేరకు అన్నప్రసాదం వివరాలను వెల్లడించింది.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆలయ అర్చకులు, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa