ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 5వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇవాళ్టి నుంచే నామినేషన్ల దాఖలు మొదలు కాగా.. ఆదివారం మినహా నవంబర్ 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు మందిరంలో ఉన్న రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 21 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబరు 5న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. డిసెంబరు 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
2021లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి షేక్ బాబ్జీ ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే షేక్ బాబ్జీ 2023 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. మరోవైపు నామినేషన్ల స్వీకరణ మొదలుకావటంతో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కలెక్టరేట్ చుట్టూ వంద అడుగుల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. అలాగే నామినేషన్ వేసే అభ్యర్థితో పాటుగా మరో నలుగురికి మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ దరఖాస్తులను ఉచితంగా అందిస్తారు. కాకినాడ కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,316. పురుష ఓటర్లు 9,674 మంది ఉంటే.. మహిళా ఓటర్లు 6,674 మంది ఉన్నారు. మొత్తం ఆరు జిల్లాల్లోని 113 మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఓటింగ్ కోసం 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంపై టీడీపీ సమాలోచనలు చేస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేరును ఇప్పటికే టీడీపీ కూటమి ప్రకటించింది. మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీచేస్తారా ఎవరికైనా మద్దతు ఇస్తారా అనేది చూడాలి మరి. వైసీపీ ఇప్పటికే ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa