ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 35 కోసం ఇంజినీర్ ఐదేళ్ల పోరాటం.. రూ. 2.43 కోట్లు చెల్లించిన రైల్వే

national |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2024, 10:22 PM

తనకు రావాల్సిన రూ.35 రీఫండ్ కోసం రైల్వేతో రెండేళ్ల పాటు పోరాటం సాగించి.. విజయం సాధించాడు ఓ ప్రయాణికుడు. అయితే, తాను మాత్రమే గెలవడం కాదు.. తనలాంటి దాదాపు 3 లక్షల మందిని గెలిపించాడు. ముందు రూ. 35 రీఫండ్ చేయడానికి ససేమిరా అన్న రైల్వే.. గోటితో పోయేదాన్ని గొడ్డిలిదాకా తెచ్చుకున్న చందంగా చివరకు రూ. 2.43 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. రాజస్థాన్‌లోకి కోటాకు చెందిన సుజీత్ స్వామి (30) అనే ఇంజనీర్ 2017 జులై 2న న్యూఢిల్లీ వెళ్లేందుకు ఏప్రిల్‌లో గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, అదే ఏడాది జులై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది.


అనివార్య కారణాల వల్ల ప్రయాణం వాయిదా పడటంతో టిక్కెట్‌ను రద్దుచేసుకున్నారు. మొత్తం రూ. 765 టిక్కెట్ కోసం వసూలు చేసిన రైల్వే.. క్లరికల్‌ చార్జీ కింద రూ.65, జీఎస్టీ రూ.35 కట్ చేసి రూ.665 రిఫండ్‌ చేసింది. తాను టికెట్ బుక్ చేసుకునే సమయానికి జీఎస్టీ లేదని, అలాంటప్పుడు రూ. 35 ఎందుకు వసూలు చేశారో చెప్పాలని, ఆ డబ్బులు రీఫండ్ చేయాలని కోరుతూ లేఖ రాశారు. రైల్వే స్పందించకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా 50 దరఖాస్తులు వేశాడు. నాలుగు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేశాడు. లోక్‌ అదాలత్‌ను కూడా ఆశ్రయించాడు.


తనకు రీఫండ్ ఇవ్వాలంటూ ప్రధాని, రైల్వే, ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్‌కు సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేశారు. రెండేళ్ల పాటు సుజీత్ సుదీర్ఘ పోరాటానికి రైల్వేశాఖ దిగొచ్చింది. కేవలం సుజీత్ ఒక్కరే కాదు.. 2.98 లక్షల మంది ప్రయాణికులకు మొత్తం రూ. 2.43 కోట్లు రీఫండ్ అందించేందుకు అంగీకరించింది. కానీ, రైల్వే రూ.33 చెల్లించడంతో మిగతా రూ.2 కోసం మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు. 2019 జులైలో రూ.2 తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఐ దరఖాస్తు చేశాడు. ప్రతి రెండు నెలలకు ఒకసారి రిఫండ్ స్థితి గురించి సమాచారాన్ని తెలుసుకునేవాడు. చివరకు ఈ ఏడాది మే 30 రూ.2 రైల్వే శాఖ జమచేసింది. తనకు వచ్చిన రూ.35 రీఫండ్‌ను పీఎం కేర్ ఫండ్స్‌కు సుజీత్ బదిలీ చేశాడు.


సుజీత్ స్వామి ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వేశాఖ బదులిచ్చింది. కమర్షియల్ సర్క్యులర్ నంబర్. 43ని కోట్ చేస్తూ.. జీఎస్టీ అమలుకు ముందు బుక్ చేసిన, అమలు తర్వాత రద్దు చేసిన టిక్కెట్లకు బుకింగ్ సమయంలో వసూలు చేసిన సర్వీస్ ట్యాక్స్ తిరిగి చెల్లించబోమని వెల్లడించింది. రద్దుచేసిన టిక్కెట్‌పై రూ. 100 (రూ. 65 క్లరికల్ ఫీజు, రూ. 35 సేవా పన్ను) వసూలు చేసింది. అయితే, జులై 1, 2017లోపు బుక్ చేసుకున్న, రద్దు చేసిన టిక్కెట్‌లకు, బుకింగ్ సమయంలో విధించిన సేవా పన్ను మొత్తం తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.


రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి?


టిక్కెట్ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని రద్దుచేస్తే కొన్ని మినహాయింపులతో రీఫండ్ ఇస్తారు. బుకింగ్ సర్వీస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి, దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత, దానిపై పన్ను విధింపు మొదలైంది వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టిక్కెట్‌ను రద్దుచేసుకుంటే.., కమర్షియల్ సర్క్యులర్ 43 ప్రకారం.. బుకింగ్ సమయంలో వసూలు చేసిన సేవా పన్ను తిరిగి చెల్లించబడదు.


కన్ఫర్మ్ చేసిన టిక్కెట్‌ను రైలు బయలుదేరే 48 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే జనరల్ క్లాస్‌లో రూ.60, స్లీపర్‌ రూ.120, ఏసీ ఛైర్‌కార్‌ రూ.120, థర్డ్ ఏసీ రూ.180, సెకండ్ ఏసీ రూ.200 కట్ చేస్తారు. ఫస్ట్‌క్లాస్ టిక్కెట్ అయితే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ. 240 వసూలు చేస్తారు. రైలు బయలుదేరడానికి 12 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే, 25 శాతం, బయలుదేరే 4 గంటలలోపు రద్దు చేస్తే, 50 శాతం కోత విధిస్తారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వెయిటింగ్ లిస్ట్, RAC టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఒక్కొక్కరికి రూ.20 చొప్పున కట్ చేస్తారు. మొత్తం వెయిటింగ్ లిస్ట్ ఉంటే.. అవి ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa