ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభలో తన ప్రసంగంతో నవ్వులు పూయించారు. ఇంతకీ ఆయన మాట్లాడిన టాపిక్ ఏంటంటే... రుషికొండ ప్యాలెస్-లగ్జరీ కమోడ్. ఇటీవల సీఎం చంద్రబాబు సహా, రుషికొండ ప్యాలెస్ ను సందర్శించిన వాళ్లందరూ ఆ విలాసవంతమైన కమోడ్ దగ్గరే ఆగిపోయి, ఎక్కువ సేపు పరిశీలించారంటే అతిశయోక్తి కాదు. రూ.11 లక్షల ఖరీదు చేసే ఆ కమోడ్ లో ప్రత్యేకత ఏంటి? అనే చర్చ కూడా బాగా నడిచింది. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా తనదైన శైలిలో కమోడ్ గురించి వ్యాఖ్యానించారు. "ఆ కమోడ్ మీద కూర్చునే అవకాశం నాకు రాలేదు అధ్యక్షా! కానీ, ఇక్కడున్న సభ్యుల్లో ఆ కమోడ్ మీద కూర్చునే అవకాశం ఎవరికైనా వచ్చిందేమో తెలియదు... ఇక్కడ పెద్ద పెద్ద వారున్నారు, డబ్బున్న వారున్నారు, కోటీశ్వరులున్నారు! ఇంతకీ ఆ కమోడ్ కు అంత ఖరీదు ఎందుకంటే అధ్యక్షా... వాళ్లు చెప్పిందేమిటంటే... అంతా ఆటోమేటిక్ వాషింగేనట అధ్యక్షా. దాని మీద మనం కూర్చుంటే చాలు... మనమేం చేయనక్కర్లేదు... ఆటో వాషింగ్... అదే వాషింగ్ చేసేస్తుందట... మనం చేతులు వాడాల్సిన అవసరం లేదు, న్యాప్ కిన్ లు వాడాల్సిన అవసరంలేదు, లేకపోతే టిష్యూ పేపర్ వాడాల్సిన అవసరంలేదు... మొత్తం ఆటోమేటిక్!" అంటూ విష్ణుకుమార్ రాజు సభలో హాస్యం పండించారు. ఇతర ఎమ్మెల్యేలే కాదు, స్పీకర్ కుర్చీలో ఉన్న అయ్యన్నపాత్రుడు సైతం విష్ణుకుమార్ రాజు వివరణకు నవ్వకుండా ఉండలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa