పెదబయలు మండలంలోని రూఢకోట పంచాయతీ మారుమూల గ్రామమైన పెదకొండాకు సరైన రహదారి లేదు. దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలీలోనే మోసుకెళ్లాల్సిన పరిస్థితి. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను గ్రామస్తులు కోరారు. కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తామే రహదారిని బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం గ్రామంలోని పెద్దలు, పిల్లలు అంతా ఏకమై పారా, గునపం చేత పట్టి కనీసం ఫీడర్ అంబులెన్స్ అయినా గ్రామానికి చేరుకునే విధంగా పర్రేడా పంచాయతీ పెద్దపుట్టు గ్రామం నుంచి పెద కొండా గ్రామం వరకు 5 కిలో మీటర్ల మేర రోడ్డు బాగుచేసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమకు సౌకర్యాలు కల్పించడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదని వాపోయారు. గర్భిణులను, అనారోగ్యానికి గురైన వారిని డోలీలోనే ఆస్పత్రికి తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాలన్నా సరైన మార్గం లేక పాట్లు పడుతున్నామని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై ఫీడర్ అంబులెన్స్ తమ గ్రామానికి వచ్చే విధంగా రోడ్డును బాగు చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్తులు మన్మథరావు, రాధాకృష్ణ, సింహాద్రి, తౌడుబాబు, కర్రమ్మ, చిలకమ్మ, ప్రవళిక, తదితరులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa