ఏపీలో ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధానం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్టటంతో పాటుగా.. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు పూర్తిచేయడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యాలని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో మరో ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో నూతన ఐటీ పాలసీపై చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, ఇతర టెక్నాలజీలదేనన్న చంద్రబాబు.. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా అభివృద్ధి చెందుతున్న డీప్ టెక్ నుంచి వచ్చే అవకాశాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర యువత భవిత డీప్ టెక్నాలజీ, ఏఐ మీద ఆధారపడి ఉందన్న చంద్రబాబు డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని.. 2034 నాటికి ఈ సంఖ్యను పది లక్షలకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఇక ఐటీ కంపెనీలు, ఐటీ డెవలపర్లకు ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా సమీక్ష సందర్భంగా అధికారులతో చంద్రబాబు చర్చించారు. అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టార్టప్ పాలసీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు నిర్వహించే స్టార్టప్లకు 25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇస్తామన్న ముఖ్యమంత్రి.. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను ఐఐటీలతో అనుసంధానం చేసే దిశగానూ చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa