ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి అభివృద్ధి పనులు జనవరి నుండి ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 10:32 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతాయని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్బంగా కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి వివరాలను మంత్రి పొంగూరి నారాయణ వివరించారు.ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయింపునకు సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్‌కు 5 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు కేటాయించామని చెప్పారు.


ఇక బసవ తారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు 15 ఎకరాలు కేటాయించామని వివరించారు. ఎల్ అండ్ టీ (లార్సన్ అండ్ టర్బో) స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి 5 ఎకరాలు కేటాయించామన్నారు. బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయించామని తెలిపారు.టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు కేబినెట్ సబ్ కమిటీ పూర్తి అంగీకారం తెలిపిందని వివరించారు. గతంలో 131 మందికి భూములు ఇచ్చామని.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని ఈ సందర్బంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు.వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తవ్వాలని ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. ఈ డిసెంబరు నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వచ్చే జనవరి నుంచీ రాజధానిలో పనులు ప్రారంభమవుతాయని మంత్రి పి.నారాయణ వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి వాటి గడువు పొడిగించినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa