ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతివాసులకు ఉచితంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 07:48 PM

తిరుపతివాసులకు టీటీడీ తీపికబురు చెప్పింది.. టీటీడీ పాలకమండలి నిర్ణయం ప్రకారం ఉచిత దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ముందుగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును జారీ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ నిరంతరాయ వర్షాల కారణంగా ఈ తేదీని డిసెంబర్ 2కు మార్పు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.


ఈ మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి సదరు కేంద్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది. తిరుపతివాసులకు 20వేల టోకెన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.


తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయ పోటు పేష్కార్ శ్రీ మునిరత్నం సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


కపిలేశ్వరస్వామివారికి హోమం


తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన‌, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. తర్వాత రాత్రి శ్రీ కాలభైరవ స్వామివారి క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ ఆరాధ‌న‌ నిర్వహించారు. నవంబరు 30న శ్రీ కాలభైరవస్వామివారి హోమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో గౌతమి, ఆల‌య డిప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com