ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోని పాక్ ప్రభుత్వ హోటల్‌కు రూ.1860కోట్లు.. తీవ్రంగా మండిపడ్డ వివేక్ రామస్వామి

international |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 09:57 PM

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ.. మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనుంది. ఇక కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తన కేబినెట్ సహా ఇతర కీలక పోస్ట్‌లకు ట్రంప్.. తన వర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వ నిధులు వృథాను అరికట్టేందుకు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర పాలక సంస్థ.. అమెరికాలో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఓ హోటల్‌కు రూ.1860 కోట్లు చెల్లిస్తోందని తెలియగా.. తీవ్రంగా మండిపడ్డారు.


అమెరికాలోకి అక్రమ వలసవచ్చిన వారికి వసతి కల్పించేందుకు న్యూయార్క్‌ నగర పాలక సంస్థ.. స్థానికంగా పాక్ ప్రభుత్వానికి చెందిన రూజ్‌వెల్ట్ హోటల్‌కు ఏకంగా 220 మిలియన్ డాలర్లు.. అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.1860 కోట్లు వెచ్చించడం సరైంది కాదని వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు. అక్రమ వలసదారుల కోసం పన్ను చెల్లింపుదారుల నిధులతో విడిది ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక ఇటీవల అమెరికాకు చెందిన రచయిత జాన్ లెఫెవ్రే.. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. మ్యాన్ హట్టన్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌.. ప్రస్తుతం పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం అధీనంలో ఉందని.. అందులో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిపారు. అయితే ఇలా ఆశ్రయం కల్పించడానికి న్యూయార్క్‌ నగర పాలక సంస్థ.. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి రూ.1860.40 కోట్లు చెల్లిస్తోందని పేర్కొన్నారు.


మరోవైపు.. పాకిస్తాన్ దివాలా తీయకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధి-ఐఎంఎఫ్‌తో చేసుకున్న 1.1 బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగానే.. ఈ రూజ్‌వెల్ట్ హోటల్‌ను ఎంచుకున్నారు. ఈ డీల్‌కు ముందు.. 2020 నుంచి ఆ రూజ్‌వెల్ట్.. స్టార్‌ హోటల్‌ సరైన బుకింగ్స్‌ లేక మూతపడే స్థితిలో ఉందని జాన్ లెఫెవ్రే వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూస్‌వెల్ట్ పేరుతో ఉన్న ఈ 19 అంతస్తుల బిల్డింగ్.. ప్రస్తుతం అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడానికి కేంద్రంగా మారుతోందని జాన్ లెఫెవ్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రూజ్‌వెల్ట్ హోటల్‌లో మొత్తం 1200 రూమ్స్ ఉన్నాయని తెలిపారు.


ఈ నేపథ్యంలోనే జాన్ లెఫెవ్రే చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై వివేక్‌ స్పందించారు. అక్రమ వలసదారులకు పన్ను చెల్లింపుదారులే పాక్‌ ప్రభుత్వ హోటల్‌లో విడిదిని ఏర్పాటు చేశారు. అంటే న్యూయార్క్ నగర పన్ను చెల్లింపుదారులే.. అక్రమ వలసదారులు అమెరికాలో ఉండేందుకు డబ్బు చెల్లిస్తున్నారని.. ఇది విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించిన తర్వాత టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్, వివేక్‌ రామస్వామిలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీకి అధిపతులుగా నియమించారు. ప్రతీ సంవత్సరం అమెరికా ప్రభుత్వం ఖర్చుచేస్తున్న 6.5 ట్రిలియన్‌ డాలర్ల నిధుల్లో అవసరం లేని ఖర్చులు, అవినీతిని అరికట్టేందుకు.. ఫెడరల్‌ సంస్థలను పునర్నిర్మించడానికి వీరిద్దరూ కృషి చేస్తారని డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. వీరు వాలంటీర్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ, ప్రభుత్వం తరఫున పోరాటయోధులుగా ఉంటారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa