ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటులో "ది సబర్మతి రిపోర్ట్" సినిమా చూడనున్న ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2024, 09:18 PM

గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఘటనల ఆధారంగా తీసిన "ది సబర్మతి రిపోర్ట్" సినిమా ఇటీవలె థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ "ది సబర్మతి రిపోర్ట్" సినిమాను సోమవారం సాయంత్రం బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. అయితే ఈ "ది సబర్మతి రిపోర్ట్" సినిమాను ఇతర నేతలతో కలిసి.. ప్రధాని మోదీ చూడనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ధీరజ్ సర్నా తెరకెక్కించగా.. విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా మరో కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పుడు పార్లమెంటులోనూ ప్రదర్శించనుండటం విశేషం.


ఇక ఈ "ది సబర్మతి రిపోర్ట్" సినిమానను చూసిన ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రతీ ఒక్కరూ ఈ "ది సబర్మతి రిపోర్ట్" చిత్రాన్ని తప్పక చూడాలని ఆ నెటిజన్ పేర్కొన్నాడు. చాలా సున్నితమైన అంశాన్ని డైరెక్టర్ ధీరజ్ సర్నా.. తెరపై చాలా చక్కగా చూపించారని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఒక నాయకుడి గొప్పతనానికి భంగం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు కావాలనే.. ఈ ఘటనను ఆ రోజుల్లో రాజకీయం చేశారని తెలిపాడు. అయితే ఆ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఇటీవలె ప్రధాని మోదీ స్పందించారు. కల్పిత కథనాలు కొంత కాలం వరకే కొనసాగుతాయని.. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో నిజాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతేకాకుండా ఈ "ది సబర్మతి రిపోర్ట్" సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు.


అసలు ఏంటి ఈ గోద్రా అల్లర్లు?


2002 ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం గుజరాత్‌ పంచ మహల్ జిల్లాలోని గోద్రా రైల్వే స్టేషన్‌కు సబర్మతి ఎక్స్‌ప్రెస్ చేరుకుంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి గుజరాత్‌లో అహ్మదాబాద్ వరకు ప్రయాణించే ఆ రైలులో వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇక ఆ రైలులోనే అయోధ్యలో మతపరమైన సమావేశం నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు కూడా ఉన్నారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు గోద్రా నుంచి బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ చైన్‌ని చాలా సార్లు లాగినట్లు లోకో పైలట్ తెలిపారు. దీంతో రైలు ఆగిపోగా.. దానిపై దాడి జరిగింది. దాదాపు 2 వేల మంది వ్యక్తుల గుంపు.. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. 4 కోచ్‌లను తగలబెట్టారు. ఇందులో ఎస్6 కోచ్ పూర్తిగా కాలిపోవడంతో.. ఈ ఘటనలో 27 మంది మహిళలు, 10 మంది పిల్లలు సహా మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే దాడిలో మరో 48 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ గోద్రా రైలు అగ్నిప్రమాదం తర్వాత గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. తీవ్రమైన మతకలహాల్లో హిందువులు, ముస్లింలు భారీగా చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa