ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళాలు అందించారు. ఇందులో విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారుల వరకూ ఉన్నారు. అయితే తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ అమరావతికి కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె విజయలక్ష్మి అమరావతి నిర్మాణం కోసం రూ. కోటి ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన విజయలక్ష్మి కోటి రూపాయల విరాళం తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.
మరోవైపు విజయలక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి తల్లి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. అయితే ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంలో తన భాగస్వామ్యం కూడా ఉండాలని ఇందిరాదేవి ఆశించేవారు. దీంతో అమ్మ కోరిక నెరవేర్చేందుకు విజయలక్ష్మి హైదరాబాద్లోని స్థలాన్ని అమ్మి.. అమరావతికి విరాళం అందించారు. తల్లి ఇందిరాదేవి పేరిట కోటి రూపాయలను విరాళంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతికి అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని సీఎం చంద్రబాబు అభినందించారు. రాజధాని నిర్మాణం కోసం విజయలక్ష్మి ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందని చంద్రబాబు కొనియాడారు.
మరోవైపు అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు ప్రారంభించింది. రూ.11,467 కోట్లతో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు సీఆర్డీఏ అథారిటీ సోమవారం ఆమోదం తెలిపింది. రూ.2,498 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు.. రూ.1,585 కోట్లతో కాలువల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం.. రూ.3,525 కోట్లతో ఐఏఎస్, గెజిటెడ్, నాన్గెజిటెడ్ అధికారుల నివాస భవనాలు నిర్మించనున్నారు. మరోవైపు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి కోసం రూ.3,859 కోట్లు కేటాయించారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తైన తర్వాత శరవేగంగా పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa