ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో షాక్.. ఇది రెండోసారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 07:48 PM

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన మరో రొయ్యల ఫ్యాక్టరీ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కాలుష్య నియంత్రణ మండలి) విశాఖపట్నం జోనల్‌ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలో వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో ఫ్యాక్టరీ ఉంది.. ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో ఈ పరిశ్రమలో అతిక్రమణలు గుర్తించి సరిదిద్దుకోవాలని పీసీబీ నోటీసులు జారీ చేసింది. అయినా సరే పట్టించుకోకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయమని (క్లోజింగ్‌ ఆర్డర్‌) ఉత్తర్వులిచ్చారు అధికారులు.


క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చిన వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ రొయ్యల శుద్ధి యూనిట్‌ 25 టన్నుల సామర్థ్యంతో నడుస్తోంది. ఇక్కడ 300 మంది పనిచేస్తుండగా.. 1.5 టన్నుల అమ్మోనియా నిల్వ ట్యాంకు ఉంటే.. లీకేజీలు, ప్రమాదాలు గుర్తించే హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేయలేదని చెబతున్నారు. అలాగే వ్యర్థాల శుద్ధికేంద్రం ఉన్నా సరిగా పనిచేయడంలేదని.. అనుమతి లేకుండా 20 టన్నుల ఐస్‌ ట్యూబ్‌ ప్లాంటు నిర్వహిస్తున్నట్లు గుర్తించారట. ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలని జులై 3న నోటీసులు జారీ చేశారు.. ఆ తర్వాత తనిఖీలు చేసినా స్పందించకపోవడంతో మూసివేతకు ఉత్తర్వులు జారీ చేశారు.


వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో రొయ్యల్ని శుద్ధిలో భాగంగా వచ్చే వ్యర్థాలను డిస్పోజ్‌ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా తక్కువకు అప్పగిచడంతో పాటుగా మిగిలినదాన్ని అనధికారికంగా బయటకు పంపేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 8న ఈ లోపాలపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. వెంటనే స్పందించిన ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఆర్‌టీపీఎంఎస్ (రియల్‌టైం పొల్యూషన్‌ మానిటరింగ్‌ సిస్టమ్) ను అందుబాటులోకి తెచ్చి.. త్వరలో పీసీబీ సర్వర్‌కు కనెక్ట్‌ చేస్తామన్నారు. తమకు నవంబరు వరకు గడువివ్వాలని కోరగా.. సూయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మూడు నెలల సమయం అడిగారు. కానీ నవంబర్ నెల ముగిసినా ఈ లోపాలను సరిదిద్దలేదు.. ఈనెల 21న పీసీబీ కమిటీ ఫ్యాక్టరీకి వచ్చి ఈ విషయాన్ని నిర్ధారించింది. గతంలో చెప్పిన గడువులోగా లోపాలను సరిదిద్దకపోవడంతో ప్లాంట్‌ను సీజ్‌ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 6న కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో ద్వారంపూడి కుటుంబానికే చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమలోనూ ఉల్లంఘనలు గుర్తించి మూసివేయించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఫ్యాక్టరీకి సంబంధించి క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చారు. వరుసగా రెండు ఫ్యాక్టరీలు మూసివేయడం ద్వారంపూడికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa