పాఠశాలల్లో విద్యాపరమైన నాణ్యతతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలోనూ రాజీపడేది లేదని సిద్దిపేట జిల్లా విద్యాధికారి ఎల్లెంకి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆయన జగదేవపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.
అదేవిధంగా జాతీయ స్థాయిలో బుధవారం నిర్వహించిన పరఖ్ విద్యాసర్వే పరీక్షకు సంబంధించిన కేంద్రాలైన ప్రాథమికోన్నత పాఠశాల దౌలాపూర్, ప్రాథమిక పాఠశాల మాందాపూర్ లతో పాటు ప్రాథమిక పాఠశాల తీగుల్, కొండాపూర్, బిజి వెంకటాపూర్, బచ్చలగూడ, జగదేవపూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో దాదాపుగా ఖాళీలను పూర్తిచేసినందున ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలన్నారు.
గతంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రం దిగువ స్థాయిలో వుందని , ఈసారి మన రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి మాదిరి పరీక్షలు నిర్వహింప చేసి విద్యార్థులను చైతన్య పరచామన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరాఖ్ విద్యా సర్వేలో మంచి ఫలితాలను ఆశిస్తున్నా మన్నారు. సందర్శించిన అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలును పరిశీలించి ఉపాధ్యాయులకు , మధ్యాహ్న భోజన కార్మికులకు సూచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఖచ్చితంగా పాటించాలన్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. తీగుల్, పాఠశాలలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి ఉపాద్యాయులను అభినందించారు.
పాఠశాలలో గత పది సంవత్సరాలుగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఉచితంగా బోధన చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు తొందురు బాల్ రెడ్డిని అభినందించి సన్మానించారు. మందాపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిఈఓ శ్రీనివాస్ రెడ్డి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంట మండల విద్యాధికారి ఎం.మాధవ రెడ్డి , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి. సైదులు, ఆయా పాఠశాలల ఉపాద్యాయులు గొపికళ, సత్తయ్య, నవనీత, భాస్కర్, నాగరాజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa