శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగుల బలహీనతలో ఆటలాడుతున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ వ్యవస్థాపకుడు బసవ రమణ వ్యవహారంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ అరాచకాలు, అకృత్యాలపై పలువురు సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ అభ్యర్థులను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. ఈ విషయంపై పలువురు నెటిజన్లు మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్, ప్రెసిడెంట్ అయిన బసవ రమణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని అందులో ఫిర్యాదు చేశారు.
ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులకు ఆశ జూపించి.. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు నుంచి రూ. 10 లక్షల వరకూ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ నిర్వాహకులు వసూలు చేశారని నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు. ఇలా వసూలు చేసిన డబ్బులను తన విలాసాలకు ఖర్చుచేసిన బసవ రమణ.. ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తారని అడిగిన విద్యార్థులను, యువతను కొడుతున్నారంటూ ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఈ సమస్యను సీరియస్గా తీసుకోవాలంటూ నారా లోకేష్ను కోరారు. ఇక వీరు షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
కారణాలు ఏవైనా కానీ.. ఇలాంటి చర్యలు సరికాదని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం మీద సరైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు, శ్రీకాకుళం జిల్లా పోలీసులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజనం తీవ్రంగా మండిపడుతున్నారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థపైనా, ఫౌండర్ బసవ రమణపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని.. కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa