ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింక్ బాల్ టెస్టులో తొలిరోజు ఆట ఆసీస్‌దే.. భారత్ 180 ఆలౌట్.. ఆసీస్ దీటుగా

sports |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 08:33 PM

తొలి టెస్టులో అద్భుత విజయంతో అడిలైడ్‌లోకి అడుగుపెట్టిన భారత్.. ఇక్కడా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరోసారి ఆసీస్ పేసర్లు చెలరేగగా.. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్ గిల్ 31 రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, బోలండ్ తలో రెండు వికెట్లు తీశారు. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నమోదు చేయగా.. ఈసారి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్ టెస్టులో సెంచరీ చేసి జోరు మీదున్న యశస్వీ జైస్వాల్‌ను (0) ఇన్నింగ్స్ తొలి బంతికే బోల్తా కొట్టించాడు మిచెల్ స్టార్క్. అతడి బౌలింగ్‌లో యశస్వీ.. ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్‌లో బంతి నెమ్మదిగా వస్తుందని జైస్వాల్.. స్టార్క్‌ను ఆటపట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి బౌలింగ్‌లో అది కూడా తొలి బంతికే అవుట్ అయ్యాడు.


వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్.. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. మంచి కవర్ డ్రైవ్స్‌తో వరుస బౌండరీలు సాధించాడు. మరో ఎండ్‌లో తొలుత ఓపెనర్ రాహుల్.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డా.. గాయం కారణంగా తొలి మ్యాచ్ ఆడని గిల్ మాత్రం స్కోరు బోర్డును నడిపించాడు. కాసేపటికి రాహుల్ కూడా వరుస బౌండరీలతో లైన్‌లోకి వచ్చాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అంతా బానే సాగుతుందనుకుంటున్న తరుణంలో తొలి సెషన్ కాసేపట్లో ముగుస్తుందనగా మరో స్పెల్ కోసం వచ్చిన స్టార్క్ భారత బ్యాటర్లను కకావికలం చేశాడు.


తొలుత కేఎల్ రాహుల్‌ను బౌన్సర్‌తో అవుట్ చేసిన స్టార్క్.. కాసేపటికే విరాట్ కోహ్లీని (7) కూడా పెవిలియన్ చేర్చాడు. గిల్ కూడా బోలండ్ బౌలింగ్‌లో లంచ్‌కు ముందే అవుటయ్యాడు. విరామం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మను (3) కూడా బోలండ్ అద్భుత బంతితో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. రిషభ్ పంత్ (21) రన్స్ చేశాడు. తర్వాత అశ్విన్ (22), నితీశ్ రెడ్డి కలిసి ఏడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. ఓవైపు వికెట్లు పడుతున్నా కూడా.. నితీశ్ రెడ్డి టెయిలెండర్లతో కలిసి అడపాదడపా బౌండరీలు బాదడంతో భారత్.. ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. సిరాజ్ 4 పరుగులు చేశాడు.


ఆసీస్‌దే పైచేయి..


అనంతరం.. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 86 రన్స్ చేసింది. భారత్ స్కోరుకు ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (13), మెక్‌స్వినీ (38 బ్యాటింగ్) చాలా ఓపికతో బ్యాటింగ్ చేశారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఖవాజాను బుమ్రా అవుట్ చేశాడు. అంతకుముందే మెక్‌స్వినీ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ జారవిడిచాడు. తర్వాత లబుషేన్‌తో (20 బ్యాటింగ్) కలిసి మెక్‌స్వినీ మరో వికెట్ పడకుండా ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఒక్క వికెట్ బుమ్రాకే దక్కింది. అశ్విన్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయడం గమనార్హం.


అంతకుముందు తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. 2 మార్పులే ఉంటాయనుకుంటే.. అనూహ్యంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది రోహిత్ సేన. పడిక్కల్, జురెల్ స్థానంలో రోహిత్, గిల్ రాగా.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ఆస్ట్రేలియాలో హేజిల్‌వుడ్ స్థానంలో.. బోలండ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa