ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో అన్నమయ్య ఇల్లు.. ఏంటీ వివాదం, 2007లో ఏం జరిగింది.. మళ్లీ తెరపైకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 06:38 PM

తిరుమలలో అన్నమయ్య ఇంటి నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో కొండపై మాడవీధుల విస్తరణలో భాగంగా కూల్చివేసిన అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని మంగళం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి డిమాండ్ చేశారు. ఒకవేళ ఇంటి నిర్మాణం చేయకపోతే దీక్షకు దిగుతామని చెప్పారు. అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించడంతో పాటుగా తొలగించిన హనుమంతుడి విగ్రహాన్ని మళ్లీ అక్కడే ప్రతిష్ఠించాలని కోరుతూ పుణ్యక్షేత్రాలు తిరిగి భక్తుల సంతకాలు సేకరించి టీటీడీకి సమర్పించినట్లు తెలిపారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిత్య హరినామ సంకీర్తన జరగాలని.. అప్పుడే తిరుమలలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుందన్నారు విజయశంకరస్వామి. భక్తి గీతాలు నేర్పించే గురువులకు టీటీడీ గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


మరోవైపు తిరుమలలో అన్నమయ్య ఇంటిని నిర్మించాలంటూ రెండు రోజుల క్రితం కూడా నిరసనలు తెలిపారు. తిరుపతిలోని బీటీఆర్ కాలనీలో అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలనా భవనం వరకు కళాకారులు కళారూపాలను ప్రదర్శిస్తూ శోభాయాత్రగా ర్యాలీ చేశారు. తిరుమల శ్రీవారి భక్తుడైన అన్నమయ్య ఇంటిని, హనుమంతుడి విగ్రహాలను 2007లో కూల్చేశారన్నారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి. తిరుమలలో అన్నమయ్య ఇంటితో పాటు, హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.


ఇప్పటికే ఈ డిమాండ్‌తో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో 11 లక్షల 50వేల మంది భక్తుల నుంచి సంతకాలను సేకరించి టీటీడీ ఈవో, ఛైర్మన్‌కు సమర్పించామన్నారు. తిరుమల కొండపై ఏడాదికి 3,600 బృందాలు హరినామ సంకీర్తన నిర్వహిస్తున్నాయి.. మరో ఏడువేల బృందాలు టీటీడీ దగ్గర నమోదు చేసుకున్నాయన్నారు. వీరందరికీ తిరుమల దక్షిణ మాఢ వీధిలో నిర్వహిస్తున్న తరహాలోనే.. తిరుమలలోని కొన్ని ప్రదేశాలతో, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి, కపిలతీర్థం, కోదండరామాలయం, శ్రీనివాస మంగాపురం, కార్వేటినగరం ఆలయం, అప్పలాయగుంట ఆలయాల్లో, టీటీడీ అనుబంధ ఆలయాల్లో హరినామ సంకీర్తనలకు అవకాశం ఇవ్వాలన్నారు.


అలాగే గ్రామీణ కళాకారులు నిర్వహించే చెక్క భజన కళారూపాలు, ప్రాచీన సంప్రదాయ కళలైన కూచిపూడి, భరతనాట్యం, కోలాటం వంటి కళారూపాలకు వేదిక ఏర్పాటు చేయాలన్నారు. వారికి వసతి, భోజనంతో పాటు, ప్రయాణ ఛార్జీలను టీటీడీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సాంప్రదాయ కళారూపాలను ప్రోత్సహించాలని.. గురువులకు టీటీడీ నెలకు రూ.10వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత పాలకమండలికి వినతులు అందజేశామని.. అయినా పట్టించుకోలేదన్నారు. కొత్త పాలకమండలి అయినా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరి టీటీడీ ఈ అంశంపై ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa