ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసిందని ఆయన ఆగ్రహించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం చంద్రబాబు సర్కారే చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పారు. రైతులకు అండగా నిలబడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్షల కోట్ల బడ్జెట్ వృథాగా మారుతుందన్నారు.
అందుకే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తారని తెలిపారు. వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వంలో ధాన్యం దిగుబడి అధికంగాఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. అలా ఆందోళన చెంది దళారులకు తక్కువ ధరకే విక్రయించవద్దని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కాల్సిందేనని అన్నారు. అందుకు ప్రభుత్వం అన్నీ చర్యలు చేపట్టిందని... ధాన్యంలో తేమ 20 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు. కాబట్టి వారంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతులను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.