రామభద్రపురం మండలంలోని కొట్టక్కి చెక్పోస్టు వద్ద గురువారం పట్టుబడిన గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో శుక్రవారం నిందితులను విలేకరుల ముందు హాజరుపరిచారు. ఈ వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం పాడువ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై మెరుపుదాడి చేసి రవాణాను అడ్డుకున్నారు. బొలేరో, టాటా మేజిక్ వాహనాల్లో 30 సంచులతో 810 కిలోల గంజాయిని పాచిపెంట మండలం వరకు తీసుకొచ్చారు. అక్కడ గంగవరం పోర్టు నుంచి బొగ్గు లోడుతో సాలూరు వైపు వస్తున్న లారీలో గంజాయిని ఎక్కించారు. పైన బొగ్గుల బస్తాలు కప్పి ఉంచారు. కొట్టక్కి చెక్ పోస్టువద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నారాయణరావు, ఎస్ఐ వెలమలప్రసాద్, పోలీసు సిబ్బంది ఈ లారీని తనిఖీ చేయగా రూ.40లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. ఈ కేసులో మధ్యప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ హుకుం సోలంకి, అతని కుమారుడు అనిల్ సోలంకి, ఒడిశా రాష్ట్రం కోరాపుట్కు చెందిన జ్యోతిభూషణ్ బెహరాను అరెస్టు చేసి సాలూరు కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. బొలేరో, టాటా మేజిక్ వాహనాల్లో వస్తున్న కొంతమంది పరారైనట్లు చెప్పారు. బొలేరో వాహనానికి పోలీసు నెంబరు ప్లేటు, టాటా ఏసీ మేజిక్ వాహనానికి ఫేక్ నెంబర్ ప్లేట్లను అమర్చి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ముఠా వెనక పెద్ద నెట్వర్కు ఉందన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నిందితుల ఆస్తులపై కూడా విచారణ చేస్తామన్నారు. మూడు వాహనాలతో పాటు 4 సెల్ఫోన్లు, రూ.7,405ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారైన వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను నిరోధించడంలో బొబ్బిలి రూరల్ సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ బాలి విశ్వేశ్వరరావు (విష్ణు) ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని, వారికి రివార్డుల కోసం పోలీసుశాఖకు సిఫారసు చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa